ఆల్ ఖైదాకు ప్రచారం: మౌల్వీ అరెస్టు
బెంగళూరు: ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు సహకరించాలని యువతను రెచ్చగొడుతున్నాడని ఆరోపిస్తూ ఓ మోల్వీని బెంగళూరులో అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలోని ఇలియాస్ నగరలో నివాసం ఉంటున్న మౌలానా అన్సర్ షా అనే వ్యక్తిని గురువారం రాత్రి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
శుక్రవారం పాటియాల న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి అనుమతితో జనవరి 20వ తేది వరకు కస్టడీలోకి తీసుకుని వెళ్లారు. మౌలానా అన్సర్ షా కుమారస్వామి లేఔట్ లోని మదరసాలో మౌల్వీగా పని చేస్తున్నాడు.
మౌలానా అన్సర్ షా ఆల్ ఖైదాలో చేరాలని యువతను రెచ్చగొట్టి వారిని ప్రోత్సహిస్తున్నాడని అధికారులు చెప్పారు. మొదట బనశంకరిలోని ఓ మసీదులో ఇతను ప్రచారకర్తగా పని చేసేవాడు. ఒక నెల క్రితం ఇలియాస్ నగరకు మకాం మార్చాడు.
గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో కుమారస్వామి లేఔట్ లో నివాసం ఉంటున్న ఆసీఫ్ అనే వ్యక్తి ఇంటిలో అన్సర్ భోజనం చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన ఢిల్లీ పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
తరువాత కుమారస్వామి లేఔట్ పోలీస్ స్టేషన్ లోకి తీసుకు వెళ్లి విచారణ చేశారు. అన్సర్ తో పాటు ఆటో డ్రైవర్ జబ్బార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తరువాత జబ్బార్ ను పోలీసులు విడిచి పెట్టారు.
అన్సర్ ను ఢిల్లీ తీసుకు వెళ్లారు. గత నెలలో కటక్ లో ఆల్ ఖైదాకు మద్దతుగా ప్రచారం చేస్తున్న మౌల్వీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తరువాత ఉత్తరప్రదేశ్ లో ఓ మౌల్వీని పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరు ఇచ్చిన సమచారంతో బెంగళూరులో అన్సర్ ను అరెస్టు చేశారు.