ఎర్రకోట వద్ద కుట్ర? జైషె ఉగ్రవాది అరెస్ట్: శాలువాల విక్రేతగా ఢిల్లీలో మకాం!
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద కిందటి నెల 14వ తేదీన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి, మారణ హోమాన్ని సృష్టించిన జైషె మహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి కొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధానిలోని ఎర్రకోట సమీపంలో అతను అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా.. పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. ఎర్రకోట సమీపంలో అతను అరెస్టు కావడం పలు సందేహాలను రేకెత్తిస్తోంది.
ఆ ఉగ్రవాది పేరు సజ్జద్ ఖాన్. జమ్మూ కాశ్మీర్ నివాసిగా గుర్తించారు. పుల్వామా ఉగ్రవాదుల దాడి అనంతరం అతను ఢిల్లీకి వచ్చాడని, అక్కడే మకాం వేశాడని పోలీసులు చెబుతున్నారు. స్లీపింగ్ సెల్ గా వ్యవహరిస్తున్నాడని అన్నారు. పుల్వామా ఉగ్రవాదుల దాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ముదస్సర్ అహ్మద్ ఖాన్ తో అతను టచ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తూ, శాలువాల విక్రేతగా రూపం మార్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 11వ తేదీన జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలు ముదస్సర్ అహ్మద్ ఖాన్ ను కాల్చి చంపిన విషయం తెలిసిందే.
మిలటరీ క్యాంపులో కాల్పులు: ముగ్గురు జవాన్లను కాల్చి చంపిన మరో జవాను
జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాకు చెందిన సజ్జద్ ఖాన్ సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి జరిగిన కొన్ని గంటల తరువాత ఢిల్లీకి వచ్చినట్లు స్పష్టమైంది. అతని ఇద్దరు సోదరులు కూడా జైషె మహమ్మద్ సంస్థలో పనిచేశారని, గతంలో భద్రతా బలగాలతో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో వారు హతమయ్యారని పోలీసుల దర్యాప్తులో తేలింది. సజ్జద్ ఖాన్ తరచూ ఫోన్ నంబర్లు మార్చేవాడని, ఓ యాప్ ద్వారా ముదస్సర్ సహా పాకిస్తాన్ లోని యాసిర్ అనే ఉగ్రవాదతో తరచూ సంభాషిస్తుండే వాడని ఢిల్లీ పోలసులు వెల్లడించారు.