సీబీఐ చీఫ్ రేసులో అలోక్ వర్మ
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ ) డైరెక్టర్ పదవి రేసులో ఢిల్లీ పోలీస్ చీఫ్ అలోక్ వర్మ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
జమ్ము: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ ) డైరెక్టర్ పదవి రేసులో ఢిల్లీ పోలీస్ చీఫ్ అలోక్ కుమార్ వర్మ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సీబీఐ డైరెక్టర్ ను ఎంపిక చేసేందుకు నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సంఘం సమావేశమైనా ఎటువంటి నిర్ణయం తీసుకొని సంగతి తెలిసిందే.
అయితే సీబీఐ డైరెక్టర్ పదవి కోసం అలోక్ వర్మ పేరు కూడా తెరపైకి వచ్చినట్లు ఈ సమావేశం అనంతరం సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. ముగ్గురు సభ్యుల కమిటీలో ఇద్దరి ఓట్లు అలోక్ వర్మకు వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రధాని మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖెహర్ అలోక్ వర్మకు మద్దతు ఇవ్వగా, లోక్ సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారట. కాంగ్రెస్ పార్టీ మాజీ సీబీఐ అధికారి అయిన ఆర్.కె.దత్ కు మద్దతిస్తోంది.
గత నెల 2న అనిల్ సిన్హా రాజీనామా చేసినప్పటి నుంచి సీబీఐ డైరెక్టర్ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ ఆస్థానా ఇన్ చార్జి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
అయితే ఆస్థానా నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆర్.కె.దత్.. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తో కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక కేడర్ కు చెందిన దత్ కు సీబీఐ డైరెక్టర్ పదవి చేపట్టేందుకు మరిన్ని అర్హతలు, అనుభవం ఉన్నాయని తెలిపారు. మరోవైపు ఆస్థానా నియామకాన్ని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే కూడా వ్యతిరేకిస్తున్నారు.