కాగల కార్యం కరోనా తీర్చినట్టు: ఈ రకంగా మోడీ సర్కార్కు బెనిఫిట్: ఆ శిబిరాలు అవుట్..!
న్యూఢిల్లీ: కాగల కార్యాన్ని గంధర్వులు తీరుస్తారనేది సామెత. దీన్ని అచ్చంగా ప్రాణాంతక కరోనా వైరస్కు కూడా అన్వయించుకోవచ్చు. మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ వచ్చిన షహీన్ బాగ్ శిబిరాలను ఢిల్లీ పోలీసులు తొలగించారు. ప్రాణాంతక కరోనా వైరస్ను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం లాక్డౌన్ను ప్రకటించడం, 144 సెక్షన్ను అమలు చేయడం వంటి చర్యల నేపథ్యంలో.. షహీన్ బాగ్ మొత్తాన్నీ క్లియర్ చేసేశారు.
మూడు నెలల తరువాత..
దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షహీన్ బాగ్ను కేంద్రబిందువుగా చేసుకుని ఆందోళనకారులు ఉద్యమాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారు ఈ శిబిరాలను నెలకొల్పారు. 24 గంటల పాటు ఆ శిబిరాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. షహీన్ బాగ్ను దిగ్బంధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వాటిని తొలగించడానికి సాహసించలేదు పోలీసులు.
షహీన్ బాగ్ ఖాళీ..
అలాంటి కీలకమైన షహీన్ బాగ్ ప్రస్తుతం ఖాళీ అయింది. కొన్ని రోజులుగా ఈ శిబిరాల్లో ఆందోళనకారులెవరూ కూర్చోవట్లేదు. ప్రాణాంతక కరోనా వైరస్ విస్తృతమైన ప్రస్తుత పరిస్థితుల్లో షహీన్ బాగ్ శిబిరాలను కొనసాగించడానికి పౌరసత్వ సవరణ చట్టం నిరసనకారులు కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా షహీన్ బాగ్లో నిరసనకారులెవరూ పాల్గొనకపోవడంతో వాటిని తొలగించారు.
తెల్లవారు జాము నుంచే తొలగింపు పనులు..
మంగళవారం తెల్లవారు జామునే పెద్ద ఎత్తున ఢిల్లీ పోలీసులు షహీన్ బాగ్, జాఫ్రాబాద్ ప్రాంతాలకు చేరుకున్నారు. అనంతరం ప్రొక్లెయినర్లతో శిబిరాలను తొలగించారు. ఈ సందర్భంగా నిరసనకారుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఢిల్లీ పోలీసులు అదనపు బలగాలను మోహరింపజేశారు. ఆందోళనకారులు ప్రతిఘటించిన పరిస్థితే ఎదురైతేదా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అసవరమైన చర్యలు చేపట్టారు.
Recommended Video
కట్టుదిట్టమైన భద్రత..
పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక శిబిరాలను తొలగింపు చర్యలను చేపట్టడానికి ముందే షహీన్ బాగ్ పరిసరాల్లో పెద్ద ఎత్తున అదనపు పోలీసు బలగాలను మోహరింపజేశారు. షహీన్ బాగ్కు దారి తీసే మార్గాలన్నింటినీ మూసేశారు. కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల ఆయా ప్రాంతాల్లో జనసంచారం లేకపోవడం పోలీసులకు లాభించింది. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే వాటిని తొలగించారు. వైరస్ వల్ల కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా లబ్ది పొందిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.