ఢిల్లీ ఎఫెక్ట్: టీటీవీ దినకరన్ కు సినిమా కష్టాలు, చార్జ్ షీట్ లో పేరు, ఇక అంతే!
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ కు మళ్లీ సినిమా కష్టాలు మొదలైనాయి. అన్నాడీఎంకే, ఆ పార్టీ రెండాకుల చిహ్నం కోసం భారత ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇవ్వాలని ప్రయత్నించిన కేసులో ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు విచారణ ముమ్మరం చేసి చార్జ్ షీట్ లో టీటీవీ దినకరన్ పేరు నమోదు చేసి కోర్టులో సమర్పించారు.
పన్నీర్ vsశశికళ.
అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం కోసం పన్నీర్ సెల్వం, శశికళ వర్గం భారత ఎన్నికల కమిషన్ ముందు పోటీ పడిన విషయం తెలిసిందే. ఆ సందర్బంలో అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా ఉన్న టీటీవీ దినకరన్ పార్టీని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు
ఎన్నికల కమిషన్ కు ఎర!
సుఖేష్ చంద్రశేఖర్ అనే మధ్యవర్తితో ఆ సమయంలో భారత ఎన్నికల కమిషన్ అధికారులకు రూ. 50 కోట్లు లంచం ఎర వెయ్యడానికి ప్రయత్నించారు. రూ. 1. 50 కోట్లతో సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీలోని విలాసవంతమైన హొటల్ లో బసచేసి ఎన్నికల కమిషన్ అధికారుకు బేరం పెట్టాడు.
ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఎంట్రీ
విషయం తెలుసుకున్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సుఖేష్ చంద్రశేఖర్ ను అరెస్టు చేసి నగదు, విలాసవంతమైన కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో అప్పట్లో టీటీవీ దినకరన్ మీద కేసు నమోదు చేసి విచారణ చేశారు.
తీహార్ జైలుకు టీటీవీ
టీటీవీ దినకరన్ ను ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించారు. నెల రోజులకు పైగా తీహార్ జైల్లో ఉన్న టీటీవీ దినకరన్ తరువాత బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పట్లో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జ్ షీట్ లో టీటీవీ దినకరన్ పేరు తొలగించారు.
చార్జ్ షీట్ లో టీటీవీ అండ్ కో
బుధవారం ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు భారత ఎన్నికల కమిషన్ కు లంచం ఎర చూపిన కేసులో టీటీవీ దినకరన్, ఆయన సన్నిహితుడు మల్లికార్జున్, పుల్కిత్ కుంద్రా, జై విక్రమ్ పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి ప్రత్యేక కోర్టులో సమర్పించారు.