రైతులకు మద్దతిస్తున్న సెలబ్రిటీలపై కేంద్రం చర్యలు- గ్రెటా థన్బర్గ్పై ఢిల్లీ పోలీసుల కేసు
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో మూడు నెలలుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. రిపబ్లిక్ డే రోజు ఎర్రకోటపై రైతులు జెండాలను కూడా ఎగరేశారు. అనంతరం నిరసనల తీవ్రత మరింత పెరిగింది. వీరికి అంతర్జాతీయంగా పలువురు సెలబ్రిటీలు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. దీనిపై దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనకు మద్దతు తెలుపుతున్న అంతర్జాతీయ సెలబ్రిటీల విషయంలో ఆగ్రహంగా ఉన్న కేంద్రం తాజాగా చర్యలకు దిగింది. రైతుల నిరసనకు మద్దతిస్తూ ట్వీట్ చేసిన వాతావరణ మార్పుల ఉద్యమకారిణి గ్రెట్ ధన్బర్గ్పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె చేసిన ట్వీట్ నేరపూరిత కుట్ర, మతాల పేరుతో విద్వేషం పెంచడం కిందకు వస్తుందని ఆరోపిస్తూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది.
తాజాగా రైతుల ఆందోళనకు మద్దతునిస్తూ పాప్ స్టార్ రిహన్నా ట్వీట్ చేసిన కాసేపటికే గ్రెటా ధన్బర్గ్ కూడా ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం వీరి ట్వీట్లను నిశితంగా పరిశీలిస్తున్న కేంద్రం.. న్యాయసలహా ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో విధంగా కేసులు నమోదు చేసేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ముందుగా గ్రెటా ధన్బర్గ్పై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారు. ఇందులో నేరపూరిత కుట్ర ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం ఎక్కడికి చేరుతుందో చూడాల్సి ఉంది.