JNU Violence:సీసీ ఫుటేజీల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
ఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఆదివారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై ఢిల్లీ పోలీసులు తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్యాంపస్లోకి జొరబడి అల్లర్లు సృష్టించడం, ఆస్తులు ధ్వంసం చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి జేఎన్యూ క్యాంపస్లో హింసాత్మక వాతావరణం జరిగిందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాక ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ సౌత్ వెస్ట్ డీసీపీ దేవేంద్ర ఆర్య తెలిపారు.
JNU Violence:నిర్మలా సీతారామన్ నుంచి సీతారం ఏచూరి వరకు..పూర్వ విద్యార్థుల స్పందన
అంతకుముందు జేఎన్యూలో జరిగిన హింసపై చాలా ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. ఇక ఆదివారం రోజునే ఢిల్లీ పోలీసు పీఆర్ఓ ఎంఎస్ రంధావా విద్యార్థులతో ప్రొఫెసర్లతో ఓ సమావేశం నిర్వహించారు. డెలిగేషన్ బృందంలో ఉన్న జేఎన్యూ, జామియా మరియు ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులు ప్రొఫెసర్లు ఓ అప్లికేషన్ను సమర్పించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో గాయపడ్డ వారికి వెంటనే చికిత్స అందించి ఈ హింస వెనక ఎవరున్నారో గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఘటనలో గాయపడ్డ 23 మంది విద్యార్థులకు చికిత్స అందించి ఈరోజు ఉదయం డిశ్చార్జ్ చేయడం జరిగింది.
జేఎన్యూ టీచర్స్ అసోసియేషన్ క్యాంపస్లో ఓ సమావేశం నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు క్యాంపస్లోకి ప్రవేశించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.అంతేకాదు వారు ముగ్గురు హాస్టల్స్లోకి వెళ్లి ఫర్నీచర్ను ఇతర వస్తువులను ధ్వంసం చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కొందరు ఇనుప రాడ్లు, హాకీ స్టిక్స్ పట్టుకుని క్యాంపస్లో తిరుగుతుండటం కనిపించింది. తమపై దాడి చేసి హింసకు పాల్పడినవారు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థగా ఉన్న ఏబీవీపీ వారే అని చెప్పింది జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ మరియు జేఎన్యూ టీచర్స్ అసోసియేషన్.
ఇదంతా ఒకలా ఉంటే దీనికి మరో వెర్షన్ చెప్పారు జేఎన్యూ రిజిస్ట్రార్ ప్రమోద్ కుమార్. సెమిస్టర్ బాయ్కాట్ చేయాలనే అంశంపై రెండు వర్గాలకు చెందిన విద్యార్థుల మధ్య జరిగిన గొడవగా ఘటనను వర్ణించారు. జేఎన్యూ ఇప్పటికే పోలీసుల నీడలోకి వెళ్లిపోయింది. క్యాంపస్లోకి విద్యార్థుల దగ్గర ఉన్న ఐడీని పరిశీలించాకే లోపలికి అనుమతిస్తున్నారు. హాస్టల్స్ బయట, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, ఇతర ప్రముఖ చోట్లలో సెక్యూరిటీని టైట్ చేశారు.