ఉగ్రవాదులు: డ్రైవర్ను చంపి అదే క్యాబ్లో ఢిల్లీకి...?
పఠాన్ కోట్: పంజాబ్ లోని పఠాన్ కోట్ లో మళ్లీ కలకలం రేగింది. ఆచూకీ లేకుండా పోయిన క్యాబ్ డ్రైవర్ విజయ్ కుమార్ హత్యకు గురై కనిపించాడు. హిమాచల్ ప్రదేశ్ లోని ఓ నిర్జనప్రదేశంలో శుక్రవారం ఇతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పుడిప్పుడే ఉగ్రవాద దాడి నుంచి కోలుకుంటున్న పఠాన్ కోట్ లో మళ్లీ కలకలం రేగింది. క్యాబ్ డ్రైవర్ విజయ్ కుమార్ ను హత్య చేసిన ముగ్గురు ఉగ్రవాదులు అతని ఆల్టో కారుతో సహ మాయం అయ్యారని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు.
ముగ్గురు ఉగ్రవాదులు ఢిల్లీలో ప్రవేశించారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కుమార్ హత్యకు గురైనాడని విషయం వెలుగు చూడటంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద దాడి జరగక ముందే విజయ్ కుమార్ క్యాబ్ ను కొందరు అపహరించారు. తరువాత అతనిని హత్య చేసిన నిందితులు గుట్టు చప్పుడు కాకుండా ఢిల్లీ చేరుకున్నారని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
గణతంత్ర దినోత్సవాలను భగ్నం చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నిన నేపథ్యంలోనే క్యాబ్ డ్రైవర్ హత్య జరిగిందని అనుమానిస్తున్నారు.