ఈసీకి రూ. 50 కోట్ల లంచం కేసు: దినకరన్ మధ్యవర్తి మాల్ లో హల్ చల్; ఢిల్లీ పోలీసులపై వేటు !
ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్ల లంచం ఎర కేసులో అరెస్టుటీటీవీ దినకరన్ మధ్యవర్తి సుఖేష్ ను బెంగళూరు మాల్ లో గాలికి వదిలిన పోలీసులు, సస్పెండ్కోర్టు విచారణకు హాజరు, నిందితుడు మాల్ లో షాపింగ్, బిజినెస్ డీ
న్యూఢిల్లీ/బెంగళూరు: ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ అరెస్టు చేసిన టీటీవీ దినకరన్ మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ దర్జాగా బెంగళూరు మాల్ లో షాపింగ్ చేసి, అతని వ్యాపారలావాదేవీలు నిర్వహించుకోవడానికి సహకరించిన ఏడు మంది ఢిల్లీ పోలీసులను సస్పెండ్ చేశారు.
కోర్టు విచారణ కోసం సుఖేష్ చంద్రశేఖర్ ను బెంగళూరు తీసుకు వచ్చిన ఢిల్లీ పోలీసులు అతన్ని బెంగళూరులోని ఓ ప్రముఖ మాల్ లో వదిలేసిన ఘటన వెలుగు చూసింది. భారత ఎన్నికల కమిషన్ అధికారులు అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం రద్దు చేసి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
టీటీవీ దినకరన్ మధ్యవర్తి
అన్నాడీఎంకే (అమ్మ) వర్గం నాయకుడు టీటీవీ దినకరన్ దగ్గర భారీ మొత్తంలో నగదు తీసుకున్న సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్ అధికారులకు రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు 2017 ఏప్రిల్ 16వ తేదీన సుఖేష్ చంద్రశేఖర్ ను ఢిల్లీలోని హోటల్ లో అరెస్టు చేశారు.
తీహార్ జైల్లో సుఖేష్
అప్పటి నుంచి సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదే కేసులో టీటీవీ దినకరన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చెయ్యడంతో అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు. సుఖేష్ చంద్రశేఖర్ మీద ముంబై, బెంగళూరు, కోయంబత్తూరు తదితర నగరాల్లో కేసులు నమోదు అయ్యాయి. వివిధ ప్రాంతాల్లో నమోదు అయిన కేసుల విచారణ కోసం సుఖేష్ చంద్రశేఖర్ ను కోర్టు ముందు హాజరుపరచడానికి ఢిల్లీ పోలీసులు సిద్దం అయ్యారు.
బెంగళూరు మాల్ లో దర్జాగా !
అక్టోబర్ 9, 12, 16వ తేదీల్లో వరుసగా సుఖేష్ చంద్రశేఖర్ ముంబై, కోయంబత్తూరు, బెంగళూరులోని కోర్టు ముందు విచారణకు హాజరైనాడు. ఢిల్లీ పోలీసులు 7 మంది సుఖేష్ చంద్రశేఖర్ కు ఎస్కార్ట్ గా వచ్చారు. బెంగళూరులోని ఓ మాల్ లో సుఖేష్ చంద్రశేఖర్ షాపింగ్ చేసి, అతని వ్యాపారలావాదేవీలు చర్చించుకోవడానికి ఢిల్లీ పోలీసులు అవకాశం కల్పించారు.
ఐటీ శాఖ అధికారుల డేగ కన్ను
విషయం గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్ కు లేఖరాశారు. ఢిల్లీ పోలీసులు సుఖేష్ చంద్రశేఖర్ దగ్గర లంచం తీసుకుని అతన్ని మాల్ లో వదిలేశారని సమాచారం ఇచ్చారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ శుక్రవారం విచారణకు ఆదేశించారు.
నిందితుడి దగ్గర లంచం
ఎస్కార్ట్ గా వచ్చిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ మూడవ బెటాలియన్ కు చెందిన ఏఎస్ఐ రాజేష్, హెడ్ కానిస్టేబుల్స్ జీవన్, జార్జ్, కానిస్టేబుల్స్ నితిన్ కుమార్, కేశవ్ కుమార్, దర్మేంద్ర, పుష్పేంద్రలను సస్పెండ్ చేశామని ఢిల్లీ స్పెషల్ పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) దీపేంద్ర పాథక్ మీడియాకు చెప్పారు. సుఖేష్ చంద్రశేఖర్ దగ్గర వీరందరూ లంచం తీసుకుని అతన్ని బెంగళూరు మాల్ లో వదిలేశారని విచారణలో వెలుగు చూసిందని దీపేంద్ర పాథక్ వివరించారు.