ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే కాదట.. రిపబ్లిక్ డే అంటున్న ఢిల్లీ పోలీసులు ..?
న్యూఢిల్లీ : బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి భారతవనికి విముక్తి కలిగిన రోజు ఆగస్టు 15. ప్రతి ఏటా ఈ రోజు జాతి మొత్తం జెండా పండుగ సంబురంగా జరుపుకుంటుంది. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీని జనవరి 26గా కూడా రిపబ్లిక్ డే జరుపుకొంటున్నాం. అయితే దక్షిణ ఢిల్లీ పోలీసులు తప్పులో కాలేశారు. ఆగస్ట్ 15న జరుపుకోనున్న ఇండిపెండెన్స్ డే బదులు రిపబ్లిక్ డే అని నోట్లో ముద్రించారు. దీనిని చూసిన ఓ వ్యక్తి ఢిల్లీ కోర్టును ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ దేశవ్యాప్తంగా జరుపుకొంటారు. గురువారం జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుక దక్షిణ ఢిల్లీ పోలీసు విభాగం .. అడ్వైజరీ నోట్ ముద్రించింది. అయితే అందులో ఇండిపెండెన్స్ డేకు బదులుగా రిపబ్లిక్ డే అని రాసి ఉంది. అయితే సిబ్బంది ముద్రించడం వల్లే పొరపాటు జరిగినట్టు తెలుస్తోంది. దీనిని చూసిన ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్ బుధవారం విచారించనుంది. దక్షిణ ఢిల్లీ పోలీసులు పెద్ద తప్పు చేశారని పిటిషనర్ మంజీత్ సింగ్ పేర్కొన్నారు. అడ్వైజరీ నోట్ను సీనియర్ అధికారులకు చూపించకుండా ముద్రించారని అర్థమవుతుందన్నారు. ఇంత పెద్ద అంశానికి సంబంధించి అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ సీ హరిశంకర్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించనుంది.