ఢిల్లీ హింస: యోగేంద్ర యాదవ్ తోపాటు 9 మందిపై ఎఫ్ఐఆర్, 200 మందిపై అభియోగాలు
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఉద్రిక్తతలకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. బుధవారం హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన నార్త్ బ్లాక్లో ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభమైనట్లు సమాచారం.
కాగా, ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా హింసాత్మక ఘటనలకు పాల్పడిన 200 మంది నిరసనకారులపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. పోలీసులపై దాడులు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించారని పోలీసులు తెలిపారు. రైతు నేత యోగేంద్ర యాదవ్ తోపాటు 9 మంది రైతు నేతలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఎర్రకోటపై ఇతర జెండాలు ఎగురవేసిన ఘటనను కేంద్ర హోంశాఖ సీరియస్గా తీసుకుంది. ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించాలని సూచించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ను హోంశాఖ కార్యదర్శి ఆదేశించినట్లు సమాచారం.
మంగళవారం నాటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో బుధవారం అదనపు భద్రతా బలగాల్ని మోహరించినట్లు ఇప్పటికే ఢిల్లీ పోలీసులు హోంశాఖకు నివేదిక అందజేశారు. నిన్నటి హింసకు సంబంధించి అధికారికంగా 22 కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. కాగా, మంగళవారం నాటి హింసాత్మక ఘటనలపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ సెల్ దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ దర్యాప్తులో ఐబీ, కేంద్ర దర్యాప్తు సంస్థల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హింస జరిగిన ప్రాంతాల్లో పరిస్థితి అదుపులో ఉందని పేర్కొన్నారు.
రైతుల దాడుల్లో సుమారు 300 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. వారందరికి మెరుగైన వైద్యం అందించాలని హోంశాఖ తెలిపింది. ట్రాక్టర్ పరేడ్ తలపెట్టిన రైతు సంఘాలు, ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించడం వల్లే ఢిల్లీలో హింసాత్మక ఘటనలకు కారణమైందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కాగా, ఆందోళనకారుల దాడుల్లో గాయపడిన పోలీసుల కుటుంబసభ్యులు, ఇతర పోలీసులు ఢిల్లీలో బుధవారం శాంతియుత నిరసన చేపట్టారు.
Recommended Video