మాజీ ఎంఎల్ఏ ఇంటిలో ఏకే-47 సీజ్
న్యూఢిల్లీ: నిత్యం వీవీఐపీలతో కిటకిటలాడే దేశ రాజధాని న్యూఢిల్లీలో మాజీ శాసన సభ్యుడి ఇంటిలో నిషేదిత అయుధాలు ఉన్న విషయం వెలుగు చూసింది. న్యూఢిల్లీలోని మాజీ శాసన సభ్యుడు రమ్ బీర్ షోకిన్స్ ఇంటిలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని న్యూ ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. నీరజ్ భవానా ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
మాఫియా డాన్ అబుసలేం శిష్యుడు, గ్యాంగ్ స్టర్ నీరజ్ భవానాను నాలుగు రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇతను వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలను బెదిరించి మామూళ్లు వసూలు చేస్తుంటాడు. జైలులో ఉన్న అబు సలేం సూచనల మేరకు ఇతను పని చేస్తుంటాడు.
2014 డిసెంబర్ నెలలో నీరజ్ భవానా పోలీసుల నుండి తప్పించుకునే సమయంలో ఏకే-47, ఎస్ఎల్ఆర్ రైఫిల్ చోరి చేసి మాయమయ్యాడు. అప్పటి నుండి న్యూ ఢిల్లీ పోలీసులు నీరజ్ భవానా మీద కన్ను వేశారు.
నాలుగు రోజుల క్రితం వేకువ జామున 3.30 గంటల సమయంలో వ్యాపారవేత్తను హత్య చెయ్యడానికి నీరజ్ భవానా బయలుదేరాడు. అదే సమయంలో పోలీసులు వెంటాడి నీరజ్ భవానాను అరెస్టు చేశారు. అతనిని రహస్య ప్రాంతంలో విచారణ చేశారు.
నీరజ్ భవానా తెలిసిన వివరాల ఆదారంగా రమ్ బీర్ ఇంటిలో నిషేదిత ఏకే-47, ఎస్ఎల్ఆర్ ఆయుధాలు స్వాదీనం చేసుకున్నామని పోలీసులు అన్నారు. నీరజ్ భవానాను భగ్పేట్ కోర్టులో హాజరు పరిచి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మాజీ శాసన సభ్యుడు రమ్ బీర్ షోకిన్స్ కు స్వయానా మేనల్లుడు ఈ నీరజ్ భవానా, 2013లో ఢిల్లీలో జరిగిన శాసన సభ ఎన్నికలలో రమ్ బీర్ షోకిన్స్ బావాన ప్రాంతం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి గెలుపోందాడు.