ఢిల్లీ మత ప్రార్థనల ఎఫెక్ట్: మత పెద్దలపై ఎఫ్ఐఆర్: కఠినమైన సెక్షన్ల కింద: ఏకంగా ఏడుమందిపై
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరగడానికి ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదు భవన సముదాయంలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనలే ప్రధాన కారణమంటూ ఆరోపణలు వినిపిస్తోన్న వేళ.. ఢిల్లీ పోలీసులు కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. మర్కజ్ భవనంలో సామూహిక మత ప్రార్థనలను నిర్వహించిన మత పెద్దలపై కేసు పెట్టారు. మొత్తం ఏడుమందిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు.
వివిధ కారణాలతో ఎఫ్ఐఆర్ నమోదు..
కరోనా వైరస్ విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ మత ప్రార్థనల్లో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ద్రాలతో పాటు మలేషియా, ఇండోనేషియా, కిర్గిస్తాన్ వంటి పొరుగు దేశాల నుంచి వందలాది మందిని సమీకరించడం, భవనాన్ని ఖాళీ చేయాలంటూ ఆదేశించిన్పటికీ.. దాన్ని అనుసరించకపోవడం, పోలీసుల ఆదేశాలను ధిక్కించడం, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం- వంటి కారణాలను చూపుతూ మర్కజ్ భవనం మత పెద్దలపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు.
ఏడుమంది పేర్లను చేర్చిన ఢిల్లీ పోలీసులు..
ఈ ఎఫ్ఐఆర్లో మొత్తం ఏడుమంది మత పెద్దల పేర్లను చేర్చారు. మహ్మద్ అష్రఫ్, మౌలానా సాద్, డాక్టర్ జీషాన్, ముఫ్తీ షెహజాద్, ఎం సైఫీ, యూనుస్, మహ్మద్ సల్మాన్పై ఎఫ్ఐఆర్ను నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్లో వారిపై కేసు నమోదైంది. వారిలో మౌలానా సాద్.. మర్కజ్ మసీదు ప్రధాన మౌల్వీ అని చెప్పారు. ఆయన నేతృత్వంలోనే మూడు రోజుల పాటు ఈ సామూహిక ప్రార్థనలు కొనసాగాయని తెలిపారు. ఈ ఏడుమందిని అరెస్టు చేశారా? లేదా? అనేది ఇంకా తేలాల్సి ఉంది.
మర్కజ్ ఖాళీ చేయించడానికి అయిదు రోజులు
ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ భవనాన్ని ఖాళీ చేయించడానికి ఢిల్లీ పోలీసులకు అయిదురోజులు పట్టింది. ఈ భవనం నుంచి మొత్తం 2361 మందిని పోలీసులు ఖాళీ చేయించారు. ఈ తెల్లవారు జామున 3:30 గంటలకు భవనం మొత్తం ఖాళీ అయినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. వారిలో వెయ్యిమందికి పైగా ఇప్పటికే తమ రాష్ట్రాలకు బయలుదేరి వెళ్లారని, చాలామంది దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారని పేర్కొన్నారు.
భవనం మొత్తం శానిటైజేషన్..
ప్రార్థనల్లో పాల్గొన్న వారిని ఖాళీ చేయించిన వెంటనే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మర్కజ్ భవనాన్ని శుద్ధి చేయడానికి దిగారు. భవనం మొత్తం శానిటైజ్ చేస్తున్నారు. బుధవారం ఉదయం శానిటైజేషన్ పనులను చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. రెండు రోజుల పాటు శానిటైజేషన్ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భవనాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని, బయటి వ్యక్తులు ప్రవేశించకుండా బ్యారికేడ్లను అమర్చామని చెప్పారు.