పుకార్లు నమ్మకండి.. చొరబడలేదు.. వాళ్లను తరిమేశామంతే..: ఢిల్లీ పోలీసులు
దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న'ముస్లిం విద్యార్థులపై పోలీసుల కాల్పులు' వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు ఘాటుగా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ జామియా మిలియా ఇస్లామియా(జేఎంఐ) యూనివర్సిటీలో ఆందోళన చేసిన విధ్యార్థులపై అసలు కాల్పులు జరపనేలేదని, అలా జరిగినట్లుగా వస్తున్న వార్తల్ని ఎవరూ నమ్మొద్దని ఢిల్లీ పోలీస్ శాఖ పీఆర్వో ఎంఎస్ రంధావా రిక్వెస్ట్ చేశారు. తప్పుడు వార్తలు విని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కంగారు పడొద్దని సూచించారు.
మేం ప్రొఫెషనల్ ఫోర్స్.. అలానే వ్యవహరించాం
పౌరసత్వ చట్టాన్ని నిరసిస్తూ జేఎంఐలో ఆదివారం రాత్రి ఆందోళనలు జరిగాయని, ర్యాలీ పేరుతో కొంతమంది విద్యార్థులు విధ్వంసానికి దిగారన్న కారణంతోనే అడ్డుకున్నామని, ఈ క్రమంలో ఎక్కడా కాల్పులు జరగలేదని రంధావా తెలిపారు. ఢిల్లీ పోలీసులకు ప్రొఫెషనల్ ఫోర్స్ అనే పేరుందని గుర్తుచేసిన ఆయన.. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ పరిధిదాటి ప్రవర్తించబోమని స్పష్టం చేశారు.
చొరబడలేదు.. వాళ్లను తరిమేశామంతే..
అనుమతి లేకుండా పోలీసులు యూనివర్సిటీలోకి చొరబడిమరీ విద్యార్థుల్ని కొట్టారన్న జేఎంఐ వైస్ చాన్సలర్ ఆరోపణలన్ని పోలీసులు తిప్పికొట్టారు. ఆందోళనకారుల్ని అదుపుచేసి, లోనికి తరిమేశామేతప్ప, వర్సిటీలోకి చొరబడలేదని రంధావా చెప్పారు. వీసీ ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామన్నారు.
పోలీసులకే దెబ్బలు తగిలాయి..
జేఎంఐ వర్సిటీలో విద్యార్థులు విధ్వంసానికి పాల్పడకుండా అడ్డుకునే క్రమంలో ఏసీపీ, డీసీపీ ర్యాంకు అధికారులు కూడా గాయపడ్డారని ఢిల్లీ పోలీస్ శాఖ పీఆర్వో రంధావా చెప్పారు. ముగ్గురు ఎస్ హెచ్ వో లకు ఫ్రాక్చర్లు అయ్యాయని, తీవ్ర గాయాలతో ఓ కానిస్టేబుల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని ఆయన వివరించారు.
తల్లిదండ్రులు కంగారు పడొద్దు
జేఎంఐ వర్సిటీ కాల్పులు జరిగాయన్న తప్పుడు వార్తల వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారని రంధావా గుర్తుచేశారు. ప్రస్తుతం జేఎంఐలో పరిస్థితి అదుపులో ఉందని, విద్యార్థులుగానీ, తల్లిదండ్రులుగానీ కంగారుపడొద్దని సూచించారు. వర్సిటీలో విధ్వంసానికి పాల్పడినవాళ్లను ఊరికే వదిలిపెట్టబోమని హెచ్చరించారు.