కర్ణాటకలో అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు
బెంగళూరు: ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక బృందం పోలీసులు బెంగళూరు నగరంలో శుక్రవారం వేకువ జామున ఇద్దరు అనుమానిత ఆల్ ఖైదా ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
ఢిల్లీకి చెందిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఏఐ) అధికారులు బెంగళూరు చేరుకుని జక్కసంద్రలో తలదాచుకున్న ఆల్ ఖైదా సానుభూతిపరులను అరెస్టు చేశారు. ఇదే సమయంలో ప్రత్యేక బృందం పోలీసు అధికారులు మంగళూరు, తుమకూరులో ఇద్దరు ఐఎస్ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
బెంగళూరులో ఇద్దరు, మంగళూరు, తుమకూరులో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసి ఢిల్లీ, ముంబై నగరాలకు తీసుకు వెళ్లారు.
మౌల్వీ ఇచ్చిన సమాచారంతో.........!
బెంగళూరు నగరంలోని కుమారస్వామి లేఔట్ లోని మదరసాలో మౌల్వీగా పని చేస్తున్న మౌలానా సయ్యద్ అంజార్ షా ఖాస్మీని ఇటీవల ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఆ మౌల్వీ ఇచ్చిన సమాచారం మేరకు బెంగళూరులోని జక్కసంద్రలో ఇద్దరిని అరెస్టు చేశారు.
మౌల్వీ తెలిపిన సమాచారం మేరకే హైదరాబాద్ లో నలుగురు అరెస్టు అయ్యారని పోలీసు అధికారులు అంటున్నారు. బెంగళూరులో అరెస్టు అయిన వారు ఇద్దరూ ఆల్ ఖైదాలో చేరాలని యువతను రెచ్చగొడుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు.