ఢిల్లీ మత ప్రార్థనలపై సంచలన వీడియో: మర్కజ్ మసీదు ఖాళీకి ఆదేశించినా..మత పెద్దల నిర్లక్ష్యం..!
న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని ఆందోళనలోకి నెట్టేసిన ఉదంతం ఢిల్లీ మత ప్రార్థనలు. దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు భవన సముదాయంలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనల్లో వందలాది మంది పాల్గొనడం, వారిలో చాలామందికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో అన్ని రాష్ట్రాలు ఉలిక్కి పడ్డాయి. ఈ మత ప్రార్థనల్లో పాల్గొని, స్వస్థలానికి చేరుకున్న వారి గురించి ఆరా తీస్తున్నాయి. దొరికిన వారిని దొరికినట్టుగా ఐసొలేషన్ వార్డులకు తరలిస్తున్నాయి.
మర్కజ్ మత ప్రార్థనల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి: ఢిల్లీకి వెళ్లిన మాట నిజమే.. కానీ: అంజద్ భాషా క్లారిటీ
ఢిల్లీ పోలీసులు ముందే హెచ్చరించినా..
మర్కజ్ భవనంలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనల వల్ల సంభవించే పరిణామాలను ఢిల్లీ పోలీసులు ముందే పసిగట్టారు. వెంటనే భవనాన్ని ఖాళీ చేయాలంటూ ఆదేశించారు. దీనికోసం నిజాముద్దీన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముఖేష్ వలియాన్ మర్కజ్ మసీదు మత పెద్దలను తన స్టేషన్కు పిలిపించి మరీ వారితో మాట్లాడారు. భయానక కరోనా వైరస్ దేశంలో విస్తరిస్తోందని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. వెంటనే భవనాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు.
లాక్డౌన్ ప్రకటించిన మరుసటి రోజే..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన మరుసటి రోజే పోలీసులు ఈ చర్యకు పూనుకున్నారు. పరిస్థితి తీవ్రతను వారికి వివరించారు. ప్రధానమంత్రి లాక్డౌన్ను ప్రకటించారని, వెంటనే భవనాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. దీనికి మత పెద్దలు నిరాకరించారు. రెండువేల మందికి పైగా ఉన్న మర్కజ్ భవనాన్ని తాము సగం వరకు ఖాళీ చేయించామని, ప్రస్తుతం వెయ్యి మంది మాత్రమే ఉన్నారంటూ మత పెద్దలు సమాధానం ఇచ్చారు.
వెయ్యిమందికి అనుమతి ఉన్నా..
మర్కజ్ మత ప్రార్థనల్లో పాల్గొనడానికి వెయ్యిమందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ.. రెండువేల మందికి పైగా హాజరయ్యారనే సమాచారం తమ వద్ద ఉందని ఎస్హెచ్ఓ ముఖేష్ వలియాన్ స్పష్టం చేశారు. భవనాన్ని ఖాళీ చేయకపోతే తామే ఆ పని చేయాల్సి ఉంటుందని, అక్కడిదాకా పరిస్థితిని తీసుకుని రావొద్దంటూ ఆయన సూచించారు. అయినప్పటికీ- మర్కజ్ మత పెద్దలు పట్టించుకోలేదని, దాని ఫలితంగా దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య భారీగా పెరగడానికి కారణమైందని చెబుతున్నారు.
కుట్ర కోణం ఉందంటోన్న బీజేపీ..
మర్కజ్ సామూహిక మత ప్రార్థనల వెనుక కుట్ర కోణం ఉందంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూరకంగానే మర్కజ్ మత పెద్దలు సామూహిక ప్రార్థనలకు పిలుపునిచ్చారని విమర్శిస్తున్నారు. ఈ ఘటన వెనుక గల అన్ని కారణాలను వెలికి తీయాలంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ సహా పలువురు ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. సామూహిక మత ప్రార్థనల ఉద్దేశం ఏమిటనేది విషయాన్ని వెలికి తీయాలని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకూడా దర్యాప్తునకు ఆదేశించింది.