ఢిల్లీ అసెంబ్లీ పోల్: ఓటు వేసిన రాహుల్, షీలాకు కితాబు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. ఢిల్లీలో త్రిముఖ పోటీ ఉన్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు కాంగ్రెసు, బిజెపిలు ఉండగా కొత్తగా అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ ధీటుగా నిలబడింది. ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని కేజ్రీవాల్ చెబుతున్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ గెలవకపోయినా కాంగ్రెసు, బిజెపిల విజయావకాశాలను మాత్రం దెబ్బతీయనుంది.
ఢిల్లీలో 1.19 కోట్ల మంది ఓటర్లు బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 810 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెసు నుండి షీలా దీక్షిత్, బిజెపి నుండి హర్షవర్దన్, ఆమ్ ఆద్మీ నుండి కేజ్రీవాల్లు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.
గెలుపుపై రాహుల్ ధీమా
ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ నాలుగోసారి విజయం సాధిస్తుందని ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ధీమాతో ఉన్నారు. రాహుల్ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మాట్లాడుతూ.. షీలా పైన ప్రశంసలు కురిపించారు. రాజధానికి బాగా తీర్చిదిద్దారన్నారు. ఆమె గెలుస్తుందని చెప్పారు. ఢిల్లీలో మోడీ ఫ్యాక్టర్ పని చేయదని షీలా చెప్పారు.