కేజ్రీవాల్పై క్రిమినల్ కేసులు: ఢిల్లీ ఎన్నికల్లో నేరచరితులు
న్యూఢిల్లీ: ఉద్యమాలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్పై పది క్రిమినల్ కేసులు ఉన్నాయి. అసోషియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీ ఫామ్(ఏడీఆర్) సంస్థ చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులపై ఉన్న కేసులు, వారి ఆస్తులు, అప్పుల వివరాలను ఏడీఆర్ విశ్లేషించి నివేదికను రూపొందించింది. ఫిబ్రవరి 7న జరిగే ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి 673 మంది అభ్యర్ధుల అఫిడవిట్లను పరిశీలించింది
ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 114 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, 230 మంది కోటీశ్వరులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆప్ నేత కేజ్రీవాల్ తనపై 47 అభియోగాలు ఉన్నాయని, 10 క్రిమినల్ కేసులు ఉన్నాయని తన అఫిడవిట్లో పేర్కొన్నట్లు ఏడీఆర్ తెలిసింది. ఆమ్ఆద్మీకే చెందిన మరోనేత గులాబ్ సింగ్పై కూడా పది క్రిమినల్ కేసులున్నాయి.
అదేవిధంగా మాండియా మహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి షోయబ్ ఇక్బాల్పై అత్యధికంగా పదకొండు క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. శిరోమణి అకాళీదల్ పార్టీ నేత మన్జిందర్ సింగ్పై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రణాళిక
ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఆమ్ఆద్మీ పార్టీ తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఇతర ప్రముఖ నాయకులు పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టోలోని 70 అంశాలను ప్రకటించారు. ఎన్నికల్లో తాము గెలిస్తే ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా దక్కేలా కృషి చేస్తామని కేజ్రీవాల్ ఈ సందర్భంగా చెప్పారు. 49 రోజుల పాలనలో ఎంతో చేసి చూపామని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా వాగ్దానాలను విస్మరిస్తోందని ఆరోపించారు.
తమ మేనిఫెస్టో అన్ని వర్గాలకు, జాతులకు సముచిత న్యాయం కల్పించిందని కేజ్రీవాల్ చెప్పారు. సమాజ శ్రేయస్సుకే ప్రాధాన్యతనిచ్చామన్నారు. ఢిల్లీ ప్రజలు ఎదుర్కొనే ప్రతీ సమస్యను ఇందులో చేర్చామన్నారు. మహిళల భద్రత, గృహిణుల సమస్యలపై పోరాడుతామని అరవింద్ పేర్కొన్నారు.