కేజ్రీవాల్ నెక్స్ట్ టార్గెట్: మోడీ వ్యతిరేకుల సంతోషం కొంతకాలమేనా?
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో విజయదుందుబి మోగించింది. కాంగ్రెస్, బీజేపీలను మట్టికరిపించింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకులంతా కలిసి ఏఏపీకి మద్దతిచ్చారనే వాదన ఉంది. పశ్చిమ బెంగాల్లో బద్దశత్రువులైన వామపక్షాలు, మమతా బెనర్జీలు ఢిల్లీలో ఏఏపీకి ప్రత్యక్ష మద్దతు ప్రకటించాయి.
సార్వత్రిక ఎన్నికల నుండి ప్రధాని మోడీ హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన హవాను తగ్గించేందుకు విపక్షాలు అన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక్కటయ్యాయని అంటున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి గతంలో కంటే ఓటింగ్ శాతం కేవలం ఒక్క శాతమే తగ్గింది. అయితే, కాంగ్రెస్, ఇతరులకు బాగా తగ్గింది.
గతంలో 25కు పైగా ఉన్న కాంగ్రెస్ ఓటింగ్ శాతం ఈసారి పదికంటే తగ్గింది. తద్వారా విపక్షాల ఓట్లు ఏఏపీకి పడ్డాయని తెలుస్తోంది. మోడీ హవాను అడ్డుకునేందుకే విపక్షాలు ఒక్కటి అయి ఉంటాయని బీజేపీ వర్గాలు అనుమానిస్తున్నారు. అయితే, ఇప్పుడు మోడీ హవాను అడ్డుకున్న కేజ్రీవాల్ను చూసి సంతోషిస్తున్న పార్టీలు సమీప భవిష్యత్తులో.. వారు నష్టాన్ని చవిచూడవలసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలి దెబ్బ తిన్న బీజేపీ తదుపరి ఎన్నికల్లో తనదైన వ్యూహాలను రచించుకుంటుంది. ఈ నేపథ్యంలో ఏఏపీ ఇతర రాష్ట్రాల్లోకి అడుగు పెడితే ఆ దెబ్బ ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీకే అని అంటున్నారు. ఢిల్లీ ఎన్నికల్లోనే అది నిరూపితమైందని నిదర్శనంగా చూపిస్తున్నారు.
ఇప్పటికే కేజ్రీవాల్... పంజాబ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల పైన కన్నేశారు. బీహార్, పశ్చిమ బెంగాల్లో ఏఏపీ అడుగు పెడితే ఎక్కువ నష్టం ఆ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న జేడీయు (నితీష్ కుమార్, శరద్ యాదవ్ నేతృత్వం), తృణమూల్ కాంగ్రెస్ (మమతా బెనర్జీ నేతృత్వం)లకే ఎక్కువ నష్టమని అంటున్నారు. ఈ ఆందోళన నితీష్, మమతలలో కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
తమకు ఎవరితోను పొత్తు ఉండదని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. సహజంగానే మోడీ వ్యతిరేకులైన నితీష్, మమతలు ఇప్పుడు బీజేపీ ఓటమితో సంతోషించినప్పటికీ.. ఏఏపీ తమ రాష్ట్రాల్లోకి వస్తే మాత్రం వారు కష్టాలు ఎదుర్కోక తప్పదంటున్నారు. పైగా, ఇప్పటికే బీజేపీ గట్టి ఓటమి చవి చూసినందున ఆ పార్టీ వ్యూహాత్మకంగా పని చేయడంతో పాటు, మోడీని అభిమానంచే వారు ఏకమవుతారని, తద్వారా ప్రాంతీయ పార్టీల ఓట్లనే ఏఏపీ చీల్చవచ్చంటున్నారు.
ఉత్తర ప్రదేశ్ విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీలకు అగ్రకులేతరులు, మైనార్టీల అండ ఉంటుంది. ఢిల్లీలో ఏఏపీకి పట్టం కట్టిన వారిలో వారే అధికంగా ఉన్నారు. ఇది ఎస్పీ, బీఎస్పీకి ఇబ్బందికర పరిణామమే. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో మమత పైన అసంతృప్తి, ఆగ్రహజ్వాలలు పెల్లుబికుతున్నాయి. బీజేపీ ధీటుగా ఎదుగుతోంది.
ఈ సమయంలో ఏఏపీ ఎంటర్ అయితే అందరికంటే ఎక్కువ నష్టం మమత నేతృత్వంలోనే టీఎంసీకే అంటున్నారు. బీహార్లో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జేడీయులో చీలిక, బీజేపీ ధీటుగా ఎదుగుతుండటానికి తోడు ఏఏపీ రావడం జేడీయుకు ఇబ్బందికర పరిణామమే అంటున్నారు.