సరి - బేసి విధానానికి సహకరించని బీజేపీ లీడర్.. చలానా వేసిన ట్రాఫిక్ పోలీస్
ఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్యం తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే కొందరు నగరం విడిచి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. ఈ క్రమంలో కొంతలో కొంత పొల్యూషన్కు అడ్డుకట్ట వేయడానికి మళ్లీ సరి - బేసి విధానం తెరపైకి తెచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. కాలుష్య నివారణకు సరి - బేసి విధానంలో వాహనాలను రోడ్ల పైకి అనుమతించడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ నేపథ్యంలో బీజేపీ లీడర్ విజయ్ గోయల్ నిబంధనలు ఉల్లంఘించారని ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు.
ఢిల్లీ కాలుష్యం: ప్రధానికి ప్రిన్సిపాల్ సెక్రటరీ నేతృత్వంలో హైలెవల్ కమిటీ భేటీ
సోమవారం నుంచి సరి - బేసి విధానంలో వాహనాలు రోడ్ల పైకి రావాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ క్రమంలో సోమవారం నాడు సరి సంఖ్య ఉన్న వాహనాలు మాత్రమే రోడ్ల పైకి రావాల్సి ఉంది. అయితే బీజేపీ నేత విజయ్ గోయల్ మాత్రం బేసి సంఖ్య కలిగి ఉన్న కారులో రోడ్డు పైకి వచ్చారు. ఆప్ ప్రభుత్వం తీరును తప్పు పడుతూ నిరసనగా ఆయన ఈ విధంగా ప్రవర్తించారు.
బేసి సంఖ్య నెంబర్ కలిగిన కారుతో ఆయన రోడ్డు పైకి రావడంతో ట్రాఫిక్ పోలీసులు నిలువరించారు. ఆ మేరకు చలానా వేశారు. రూల్స్ ఉల్లంఘించారని చెబుతూ ఆయనకు జరిమానా విధించారు. దాంతో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం సరి - బేసి విధానంతో కాలుష్యం తగ్గదని ఫైరయ్యారు.
ఢిల్లీని కాలుష్యపు కోరలు పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే 40 శాతం మంది నగరం విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ సర్వేలో పేర్కొనడం గమనార్హం. అదలావుంటే పొల్యూషన్ నియంత్రణ కోసం ఢిల్లీ ప్రభుత్వం తిరిగి తీసుకొచ్చిన సరి - బేసి విధానం పట్ల వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సరి - బేసి విధానం ఉల్లంఘించే వాహనదారులకు 4 వేల రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. ఢిల్లీ అంతటా ఈ విధానం పక్కాగా అమలు చేయడానికి దాదాపు ఆరు వందలకు పైగా టీములు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.