ఢిల్లీలో మళ్లీ సరి - బేసి విధానం.. కాలుష్య నివారణ కోసం వాహనాలకు బ్రేక్..!
Recommended Video
ఢిల్లీ : దేశ రాజధానిలో మరోసారి సరి - బేసి విధానం మళ్లీ తెరపైకి వచ్చింది. కాలుష్య నివారణకు సోమవారం (04.11.2019) నుంచి ఈ విధానం అమలు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ఇదివరకు సరి - బేసి విధానం తెరపైకి తేవడానికి సిద్ధమైనప్పటికీ.. కొన్ని కారణాల వల్ల అమలుకు నోచుకోలేదు. అయితే ఇటీవల ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో వాహనాలను నియంత్రించాలని డిసైడయ్యారు. అదే క్రమంలో వాహనాలు సరి - బేసి విధానంలో రోడ్ల పైకి వచ్చేలా సోమవారం నుంచి అమలు చేస్తున్నారు.
ఈ నెల 4వ తేదీ నుంచి 15 వరకు సరి - బేసి విధానం అమలులో ఉంటుందని తెలిపారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అయితే సరి - బేసి విధానం నుంచి టూ వీలర్స్తో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా మినహాయించారు. అంతేకాదు 12 ఏళ్ల వయసు లోపు చిన్నారులతో మహిళలు నడిపే వాహనాలకు కూడా సరి - బేసి విధానం నుంచి ఎగ్జెంప్షన్ ఇచ్చారు. ఇక ప్రధాన మంత్రి, రాష్ట్రపతి లాంటి వీఐపీల వాహనాలతో పాటు ఎమర్జెన్సీ సహా 29 రకాల కేటగిరీలకు సంబంధించిన వాహనాలు కూడా సరి - బేసి విధానం నుంచి మినహాయింపు పొందాయి.
ఢిల్లీని కాలుష్యపు కోరలు పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే 40 శాతం మంది నగరం విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ సర్వేలో పేర్కొనడం గమనార్హం. అదలావుంటే పొల్యూషన్ నియంత్రణ కోసం ఢిల్లీ ప్రభుత్వం తిరిగి తీసుకొచ్చిన సరి - బేసి విధానం పట్ల వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సరి - బేసి విధానం ఉల్లంఘించే వాహనదారులకు 4 వేల రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. ఢిల్లీ అంతటా ఈ విధానం పక్కాగా అమలు చేయడానికి దాదాపు ఆరు వందలకు పైగా టీములు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.