ఇక చాలు.. ఆపండి: గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, ఢిల్లీలో నిలిచిన నిర్మాణాలు
ఢిల్లీని కాలుష్యం కమ్మేసిన నేపథ్యంలో నగరంలో ఈనెల 14 వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని, పారిశ్రామిక కార్యకలాపాలను కూడా నిలిపివేయాలని గురువారం ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న వాతావరణ కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ పరిస్థితులకు అన్ని పార్టీలు, ప్రభుత్వాలు బాధ్యత వహించాలని పేర్కొంది.
భవిష్యత్ తరాలకు ఇటువంటి వాతావరణాన్ని అందిస్తున్నందుకు అందరూ సిగ్గు పడాలని స్పష్టం చేసింది. శీతాకాలంలో ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయన్న సంకేతాలు ఉన్నపుడు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఢిల్లీని కాలుష్యం కమ్మేసిన నేపథ్యంలో నగరంలో ఈనెల 14 వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని, పారిశ్రామిక కార్యకలాపాలను కూడా నిలిపివేయాలని గురువారం ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ఢిల్లీ ప్రభుత్వం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దారుణంగా విఫలమయ్యాయని పేర్కొంది.
ఎన్జీటీ చైర్మన్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం కానీ, ఏదైనా సంస్థ కానీ, లేదా వ్యక్తులు కానీ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు అని ట్రిబ్యునల్ ఆదేశించింది.
అంతేకాదు, పీఎం స్థాయిలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నీళ్లు చల్లాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. సీమెంటు, ఇసుక తీసుకువెళ్లే ట్రక్కులను కూడా నిషేధించింది. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది.