ఎన్నికల ధమాకా: ఢిల్లీలో భారీగా తగ్గిన విద్యుత్ ఛార్జీలు.. రూ.125 నుంచి రూ.20కి తగ్గింపు
న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీకి ఇంకా ఏడాది సమయం ఉండగానే ఢిల్లీ రాష్ట్ర ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను భారీగా తగ్గించనున్నట్లు ప్రకటన చేసింది. కొత్త టారిఫ్లతో కూడిన నోటిఫికేషన్ను ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ జారీ చేసింది. తగ్గించిన కొత్త విద్యుత్ ఛార్జీలు 2019-2020 ఆర్థిక సంవత్సరం నుంచే అమలు అవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ చార్జీలు ఆగష్టు 1, 2019 నుంచి అమలు కానున్నాయి.
కొత్త టారిఫ్ ప్రకారం 15 కిలో వాట్ల విద్యుత్ వినియోగించే గృహాలకు స్థిర చార్జీ తగ్గించబడింది. కొత్త శ్లాబులు ఇలా ఉన్నాయి. 2 కిలో వాట్ల వరకు రూ. 125 నుంచి రూ. 20కి తగ్గించడం జరిగింది. 2కిలోవాట్ల నుంచి 5 కిలోవాట్ల వరకు రూ.140 ఉన్న ఛార్జీలు రూ.50కి తగ్గించబడ్డాయి. 5 కిలోవాట్ల నుంచి 15 కిలోవాట్ల వరకు రూ.175 ఉన్న ఛార్జీలు రూ.100కు తగ్గించారు. ఇక డొమెస్టిక్ కేటగిరీలో 1200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించేవారికి ప్రస్తుతం ఉన్న యూనిట్ ధర రూ.7.75 నుంచి రూ.8కి పెంచడం జరిగింది.
ఇక విద్యుత్ వాడినా వాడకున్న వినియోగదారుడు ఫిక్స్డ్ ఛార్జీ కట్టాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. గతేడాది ఈ స్థిరీకరణ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. దీంతో కేజ్రీవాల్ సర్కార్పై విమర్శలు వచ్చాయి. గతేడాది పెంచిన ఛార్జీలు ఇలా ఉన్నాయి. 2 కిలో వాట్ల నుంచి 5 కిలో వాట్ల వరకు రూ.35 నుంచి రూ. 140కి పెంచడం జరిగింది. 5 కిలోవాట్ల నుంచి 15 కిలో వాట్ల వరకు రూ.45 ఉన్న ఛార్జీలు రూ.175కి పెంచారు. 15 కిలోవాట్ల నుంచి 25 కిలోవాట్ల వరకు రూ.100గా ఉన్న ఛార్జీలు రూ.250కు పెంచారు.
విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న తగ్గించాలన్న నిర్ణయం ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్ దగ్గర ఉంటుంది. ఇది స్వతంత్ర సంస్థ. సాంకేతికంగా చూస్తే విద్యుత్ ధరలపై ఢిల్లీ ప్రభుత్వ జోక్యం ఉండదు. అయితే విద్యుత్ ధరలు పెరగడంతో బీజేపీ కేజ్రీవాల్ సర్కార్ పై విమర్శలు గుప్పించింది. అయితే విద్యుత్ ధరల పెంపును ఆప్ సర్కార్ సమర్థించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కంటే విద్యుత్ ఛార్జీలు తక్కువగానే ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.