ఢిల్లీలో ఉగ్రవాదులు ? రెడ్ అలర్ట్: ఆత్మాహుతి దాడులు చేస్తారు !
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆత్మాహుతి దాడులు చెయ్యడానికి ఇద్దరు ఉగ్రవాదులు చొరబడ్డారని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఇద్దరు ఉగ్రవాదులు ఇప్పటికే చొరబడ్డారని తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. బస్సుల్లో వెళ్లేవారు, రైలు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఢిల్లీకి వస్తున్న ఓ కమర్షియల్ వాహనంలో జైషే అహమ్మద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు దేశ రాజధానికి చేరుకున్నారని అధికారులు గుర్తించారు.
ఢిల్లీకి ట్రక్ లో హోల్ సేల్ మార్కెట్ లోకి ఆపిల్స్ తీసుకు వచ్చారని అధికారులు గుర్తించారు. పశ్చిమ భారతదేశం నుంచి ఢిల్లీకి వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాజధాని వ్యాప్తంగా ఉన్న టోల్ గేట్ల దగ్గర తనిఖీలు ముమ్మరం చేశారు.
ఢిల్లీలోని ఛాందీ చౌక్, పహార్ గంజ్ తదితర రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా వేశారు. ఆలయాల దగ్గర ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి భద్రత పెంచారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ఢిల్లీలోకి అనుమతించరాదని ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
పాక్ ప్రతీకారంతో రగిలిపోతుంది జాగ్రత్త: ఇంటిలిజెన్స్
ఢిల్లీ నగరం మొత్తం ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలు, ఢిల్లీ మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలు నిఘా విభాగం ఆధీనంలోకి వచ్చాయి.
ఐఎస్ అండ్ ఇయర్ స్కీమ్ ను ఢిల్లీ పోలీసులు యాక్టివేట్ చేశారు. ఢిల్లీ నగర పోలీసు అధికారులు భారత ఇంటలిజెన్స్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఉత్తర ఢిల్లీలోని ప్రాంతాల్లో పోలీసులు భద్రత పెంచారు.