ఢిల్లీ వీధుల్లోకి రాహుల్ గాంధీ: వలస కూలీలతో ఇలా, వాహనాలు ఏర్పాటు చేసి తరలింపు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ రాజధాని ఢిల్లీలోని సుఖ్దేవ్ విహార్ ఫ్లైఓవర్ సమీపంలో సేద తీరుతున్న వలస కూలీలను కలిశారు. దేశ ఆర్థిక పురోగతి కోసం రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించే బదులు పేదలు, కూలీల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేయాలని కేంద్రాన్ని రాహుల్ కోరిన విషయం తెలిసిందే.
మాస్కు ధరించి వలస కూలీలతో..
ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వలస కూలీలను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. మాస్కు ధరించిన ఆయన ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళుతున్నారని అడిగారు. కొంత మంది ఉత్తరప్రదేశ్, మరికొంత మంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళుతున్నట్లు ఆయనకు చెప్పారు. అప్పటికే తాము హర్యానా నుంచి 130 కిలోమీటర్లు నడిచి వచ్చామని తెలిపారు.
వాహనాలు ఏర్పాటు చేసి..
50 రోజులుగా లాక్ డౌన్ అమల్లో ఉండటంతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని, అందుకే సొంత ప్రాంతాలకు కుటుంబసభ్యులతో కలిసి వెళుతున్నామని వలస కూలీలు తెలిపారు. తాము తెచ్చుకున్న డబ్బులు భోజనంకే సరిపోయాయని చెప్పారు. వలస కూలీల వెతలు విన్న రాహుల్ గాంధీ వారు స్వస్థలాలకు వెళ్లేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. దీంతో వారు ఆ వాహనాల్లో వెళ్లిపోయారు.
ఎందుకిలా జరుగుతోంది..?
వలస కూలీల కోసం ప్రభుత్వం శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ వారు రోడ్డు మార్గం గుండా కాలినడకన ఎందుకు వెళుతున్నారని తెలుసుకునేందుకే రాహుల్ గాంధీ ఈ ప్రయత్నం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, రాహుల్ గాంధీతో మాట్లాడిన వలస కూలీలను పోలీసులు అడ్డుకున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సామాజిక దూరం పాటించకపోవడంతో వారిని ఆపి జాగ్రత్తలు చెప్పినట్లు తెలిపారు.
Recommended Video
ప్రియాంక కూడా తనవంతుగా..
కాగా, రాహుల్ సోదరి, యూపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా వలస కార్మికుల తరలింపునకు చర్యలు చేపట్టారు. రాజస్థాన్ నుంచి యూపీకి వచ్చే వలస కూలీల కోసం 500 బస్సులను ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ బస్సులు కూలీలను యూపీ సరిహద్దు వరకు చేరుస్తాయని చెప్పారు.