మరో రైలు ప్రమాదం.. ఉదయం శక్తి కుంజ్.. మధ్యాహ్నం రాజధాని ఎక్స్ ప్రెస్!
హౌరా నుంచి జబల్ పూర్ వెళ్లే శక్తి కుంజ్ ఎక్స్ ప్రెస్ సోన్ బాంద్రా వద్ద గురువారం ఉదయం ప్రమాదానికి గురైన కొద్దిగంటల్లోనే ఢిల్లీ-రాంచీ రాజధాని ఎక్స్ ప్రెస్ కూడా పట్టాలు తప్పింది.
లక్నో: కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ కు రెండు రైలు ప్రమాదాలు స్వాగతం పలికాయి. మాజీ రైల్వే మంత్రి సురేష్ ప్రభు నుంచి కొత్త మంత్రి పియూష్ గోయల్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే యూపీలో జరుగుతున్న రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ లో గత నెల రోజులుగా రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం హౌరా నుంచి జబల్ పూర్ వెళ్లే శక్తి కుంజ్ ఎక్స్ ప్రెస్ సోన్ బాంద్రా వద్ద ప్రమాదానికి గురైంది. రైలుకు చెందిన ఏడు బోగీలు పట్టాలు తప్పాయి.
ఈ ప్రమాదం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో రైలు పట్టాలు తప్పడం కలకలం రేపుతోంది. ఢిల్లీ-రాంచీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఢిల్లీలోని మింటో బ్రిడ్జి సమీపంలో పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్, ఒక బోగీ పట్టాల నుంచి పక్కకి వెళ్లిపోయాయి.
అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఉత్తర రైల్వే విభాగ అధికార ప్రతినిధి ప్రకటించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించారు.