డబ్బుకు ఆశపడి నిందితులకు అండగా! తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన రేప్ బాధితురాలు
న్యూఢిల్లీ: ఆ బాలిక పాలిట కన్న తల్లిండ్రులే శాపంగా మారారు. తనపై అత్యాచారం చేసిన నిందితుల నుంచి డబ్బులు తీసుకుని, నిందితులకు మద్దతుగా నిలవడం ఆ బాలిక తట్టుకోలేకపోయింది. నిందితులకు అండగా నిలిచినది తల్లిదండ్రులే అయినా.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ బాధితురాలు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఓ వైపు చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుంటే.. కన్న తల్లిండ్రులే నిందితుల వద్ద డబ్బులు తీసుకుని బాధితురాలికి అండగా నిలవకపోవడంపై పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కిడ్నాప్, విడుదల
వివరాల్లోకి వెళితే.. ప్రేమ్నగర్లోని అమన్ విహార్లో 15ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో నివసిస్తోంది. గత ఆగస్టు 30న ఆ బాలిక కిడ్నాపైంది. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాగా, వారం రోజుల అనంతరం నిందితులు ఆ బాలికను విడిచిపెట్టారు.
పలు ప్రాంతాల్లో తిప్పుతూ అత్యాచారం..
ఇంటికి వచ్చిన బాలిక.. తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని, వారిలో స్థానిక ప్రాపర్టీ డీలర్ ఒకరు ఉన్నారని తల్లిదండ్రులకు చెప్పింది. పలు ప్రాంతాలకు తిప్పి తనపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారని తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, నిందితులు బెయిల్పై విడుదలయ్యారు.
డబ్బు ఆశకు లొంగిన తల్లిదండ్రులు
అనంతరం నిందితుల తరపు నుంచి కొందరు బాలిక తల్లిదండ్రులను సంప్రదించారు. కోర్టులో బాలిక తన స్టేట్మెంట్ను మార్చుకోవాలని, ఇందుకు రూ.20లక్షలు ఇస్తామని వారికి ఆశ చూపారు. అంతేగాక, అడ్వాన్స్గా రూ.5లక్షలు కూడా చెల్లించారు. ఈ నేపథ్యంలో బాధిత బాలికను తన వాంగ్మూలాన్ని మార్చుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అయితే, అందుకు బాలిక అంగీకరించలేదు. దీంతో ఆమెకు తన తల్లిదండ్రులతో తరచూ గొడవలవుతున్నాయి.
తండ్రి తల్లిదండ్రులపైనే ఫిర్యాదు
ఈ క్రమంలో ఏప్రిల్ 10న తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లిన సమయంలో.. ఇంట్లో మంచం కింద దాచిన డబ్బును తీసుకుని బాలిక నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లింది. జరిగినదంతా చెప్పి.. తన తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తల్లిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న తండ్రి కోసం గాలింపు చేపట్టారు. బాధిత బాలికను బాలల సంక్షేమ గృహానికి తరలించారు.