ఢిల్లీలో కరోనా కల్లోలం: గంటకు ఐదుగురు కరోనా రోగులు మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత కొద్ది వారాలుగా ప్రతి రోజూ 6వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వందకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 511 మంది ప్రాణాలు కోల్పోగా, కేవలం ఢిల్లీలోనే 121 మంది కరోనా బాధితులు మృతి చెందడం గమనార్హం.
ఏపీలో భారీగా క్షీణించిన కరోనా పాజిటివ్ కేసులు: గుంటూరులో ఎక్కువ, కర్నూలులో తక్కువ
దేశ రాజధానిలో రోజుకు 100కుపైగా మరణాలు
నిత్యం 100కు పైగా మరణాలు సంభవించడం ఇది ఐదోసారి కాగా, ప్రతి గంటకు ఐదుగురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కరోనా మృతుల సంఖ్య 8391కి చేరింది. గత శనివారం 111 మంది మరణించగా.. శుక్రవారం 118 మంది ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 18న 131, నవంబర్ 12న 104 మంది చనిపోయారు. ఢిల్లీలో శనివారం నాడు యాక్టివ్ కేసుల సంఖ్య 39,741 ఉండగా, ఆదివారం నాటికి 40,212కు చేరింది. ఢిల్లీలో 4,81,260 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
అధికంగానే కరోనా పాజిటివ్ కేసులు
అంతేగాక, నిత్యం నమోదవుతున్న కేసుల్లోనూ ఢిల్లీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 6746 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,29,863కు చేరగా, పాజిటివిటి రేటు 12.29 శాతంగా ఉంది. ఢిల్లీలో వైరస్ తీవ్రత పెరిగిన నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ప్రతి రోజూ 50వేల పరీక్షలు నిర్వహిస్తోంది. ఆదివారం 54,893 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఢిల్లీ సర్కారు వెల్లడించింది.
దేశంలో కరోనా పరిస్థితి ఇలా..
దేశంలో మాత్రం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 91,70,900 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 85,92,407 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి 1,34,212 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,42,328 యాక్టివ్ కేసులున్నాయి.