ఢిల్లీలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రత... గత 26 ఏళ్లలో ఇదే మొదటిసారి...
ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గురువారం(అక్టోబర్ 29) రాజధాని నగరంలో 12.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత 26 ఏళ్లలో ఢిల్లీలో ఇంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా ఈ సీజన్లో ఢిల్లీలో 15-16డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. చివరిసారిగా అక్టోబర్,1994లో ఢిల్లీలో 12.3డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారి కులదీప్ శ్రీవాస్తవ తెలిపారు.
అక్టోబర్ 31,1937న ఢిల్లీలో 9.4డిగ్రీల ఆల్ టైమ్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 1 వరకు ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. తరుచూ గాలులు వీస్తుండటంతో పొగమంచు ఏర్పడి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని... ఆకాశంలో మేఘాలు లేకపోవడం కూడా ఉష్ణోగ్రతలు పడిపోవడానికి ఒక కారణమని పేర్కొన్నారు.
మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) వెల్లడించిన డేటా ప్రకారం... ఆనంద్ విహార్లో 401, అలీపూర్లో 405, వజీపూర్లో 410 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. ఆర్కేపురంలో 376, ఐటీఓలో 384, లోధి రోడ్లో 311, పంజాబీ బాగ్లో 387గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది.
Recommended Video
ఎయిర్ క్వాలిటీ 0-50 మధ్య ఉంటే స్వచ్చమైనదిగా, 51-100 మధ్య ఉంటే సంతృప్తికరంగా, 101-200 మితంగా, 201-300 మధ్య ఉంటే పేలవంగా, 301-400 మధ్య ఉంటే అతి పేలవమైన, 401-500 మధ్య ఉంటే తీవ్రమైన కాలుష్యంగా పరిగణిస్తున్నారు. ఈ లెక్కన ఆనంద్ విహార్,వజీపూర్లలో గాలి కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పెరిగిన వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.