ఊడ్చేసిన కేజ్రీవాల్: ఎగ్జిట్ పోల్ సర్వేలకు చెంపపెట్టు
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ సర్వేలకు చెంపపట్టులా వెలువడ్డాయి. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆమ్ ఆద్మీ పార్టీ అతి పెద్గ పార్టీగా ఆవిర్భవిస్తుందని చెప్పినప్పటికీ ఫలితాలను అంచనా వేయడంలో ఆమడ దూరంలోనే నిలిచిపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంపూర్ణ మెజారిటీ కూడా వస్తుందా, లేదా అనే స్థాయిలో సర్వే ఫలితాలు వెలువడ్డాయి.
ఎగ్జిట్ పోల్ సర్వేలను తలదన్నుతూ అన్ని పార్టీలను ఆమ్ ఆద్మీ పార్టీ తన చీపురుతో ఉడ్చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్కు, అమిత్ షా వ్యూహాలకు కేజ్రీవాల్ రాణించకపోవచ్చుననే ఊహాగానాలు కూడా చెలరేగాయి. కానీ, అవేమీ ఢిల్లీ ఎన్నికల్లో పనిచేయలేదు. శాసనసభలోని 70 స్థానాల్లో 67 స్థానాలు దక్కించుకుని ఫలితాలను ఆమ్ ఆద్మీ పార్టీ ఏకపక్షం చేసుకుంది. కాంగ్రెసుకు ఒక్క సీటు కూడా రాలేదు. బిజెపిపై వేసిన అంచనాలేవీ నిలబడలేదు. దాదాపు 30 దాకా స్థానాలు సాధిస్తుందని సర్వేలు అంచనా వేయగా మూడు స్థానాలతో సరిపెట్టుకుంది.
ఎగ్జిట్ పోల్ సర్వేలు ఈ విధంగా వెలువడ్డాయి....
సీ - ఓటర్ సర్వే ఆమ్ ఆద్మీ పార్టీకే ఎక్కువ సీట్లు ఇచ్చింది. ఆప్కు 31 నుంచి 39 సీట్లు, బిజెపికి 27 నుంచి 35 స్థానాలు, కాంగ్రెసు పార్టీకి 2 నుంచి 4 స్థానాలు రావచ్చునని అంచనా వేసింది. దీని ప్రకారం త్రిశంకు అసెంబ్లీ కూడా ఏర్పడే అవకాశం లేకపోలేదు. దీని ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుంది.
ఇండియా టుడే - సిసిరో ఎగ్జిట్ పోల్ సర్వే ఆమ్ ఆద్మీ పార్టీకి 35 నుంచి 43 స్థానాలు, బిజెపికి 23 నుంచి 29 సీట్లు, కాంగ్రెసుకు 3 నుంచి 5 సీట్లు రావచ్చునని అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం త్రిశంకు అసెంబ్లీకి అవకాశం లేదు.
హెడ్ లైన్స్ టుడే సర్వే ప్రకారం - ఆమ్ ఆద్మీ పార్టీకి 35 నుంచి 43 సీట్లు, బిజెపికి 23 నుంచి 36 సీట్లు, కాంగ్రెసుకు 3 నుంచి ఐదు సీట్లు వస్తాయి.
టైమ్స్ నౌ సర్వే ప్రకారం - ఆమ్ ఆద్మీ పార్టీకి 31 నుంచి 36 సీట్లు, బిజెపికి 27-35 స్థానాలు, కాంగ్రెసుకు 2 నుంచి 4 సీట్లు వస్తాయి.
ఎబిపి నీల్సన్ సర్వే ప్రకారం - ఆమ్ ఆద్మీ పార్టీకి 39 సీట్లు, బిజెపికి 28 స్థానాలు, కాంగ్రెసుకు 3 స్థానాలు వస్తాయి. ఎన్డీటీవి కూడా ఆమ్ ఆద్మీ పార్టీవైపే మొగ్గు చూపుతోంది.