తాహిర్ హుస్సేన్కు షాక్.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అరవింద్ కేజ్రీవాల్..
ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్పై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వేటు వేశారు. విచారణ పూర్తయ్యేంతవరకు తాహిర్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ అల్లర్లలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతల హస్తం ఉన్నట్టు తేలితే డబుల్ పనిష్మెంట్ తప్పదని హెచ్చరించిన కొద్ది గంటలకే తాహిర్పై వేటు పడటం గమనార్హం. అల్లర్లలో ప్రమేయం ఉన్నట్టు తేలితే పార్టీలకు అతీతంగా ఎవరినీ వదిలిపెట్టేది లేదని కేజ్రీవాల్ హెచ్చరించారు. దేశ భద్రత అన్నింటి కంటే ముఖ్యమని తేల్చి చెప్పారు.
కాగా,తాహిర్ హుస్సేన్పై ఢిల్లీ పోలీసులు సెక్షన్ 302(హత్య) కింద కేసు నమోదు చేశారు. ఇంటలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ అంకిత్ శర్మ హత్యపై.. అతని కుటుంబ సభ్యులు తాహిర్పై ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేసు నమోదైంది. అంకిత్ శర్మ మృతదేహం ఓ డ్రైనేజీలో లభ్యమవడంతో అతని కుటుంబ సభ్యులు తాహిర్పై ఆరోపణలు చేశారు. తాహిర్ మనుషులు కొంతమంది తమ కొడుకుతో సహా మరో ఇద్దరిని అతని ఇంట్లోకి తీసుకెళ్లారని అంకిత్ తండ్రి ఆరోపించారు. మొదట అతనిపై దాడి చేసి.. ఆ తర్వాత కాల్చి చంపారని ఆరోపించారు.
మరోవైపు తాహిర్ హుస్సేన్ మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. తాను అమాయకుడిని అని,ఎటువంటి విచారణకైనా తాను సిద్దమని ప్రకటించారు. అల్లర్లను నియంత్రించేందుకు తాను ప్రయత్నించానని.. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు. ఫిబ్రవరి 24న పోలీసులు తన నివాసంలోకి వచ్చి తనిఖీలు చేసి.. తనను తన కుటుంబాన్ని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా చెప్పారన్నారు.