ఆ అల్లర్ల వెనుక షాకింగ్ ట్విస్ట్: పీహెచ్డీ స్టూడెంట్: 15 మంది పేర్లు: 2,695 పేజీల ఫైనల్ రిపోర్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధానిని కొన్ని రోజుల పాటు అట్టుడికించిన అల్లర్ల వెనుక కుట్రకోణం ఉందనే విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా గత ఏడాది ఢిల్లీ ఈశాన్యప్రాంతంలో చెలరేగిన అల్లర్లు యాదృశ్చికం కాదని, ఉద్దేశపూరకంగా, అశాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి కొందరు కుట్ర పన్నారని తేల్చారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు సీఏఏను అడ్గుగా పెట్టుకుని అల్లర్లను సృష్టించారని స్పష్టం చేశారు. దీనిపై 2,695 పేజీల తుది నివేదికను సిద్ధం చేశారు.
జామియా మిల్లియా స్టూడెంట్ సహా
ఢిల్లీ అల్లర్ల వెనుక కుట్రకు పాల్పడినట్లుగా అనుమానిస్తోన్న 15 మంది పేర్లను ఈ ఛార్జిషీట్లో పొందుపరిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్, జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థి మీరన్ హైదర్, జామియా కోఆర్డినేషన్ కమిటీ మీడియా కోఆర్డినేటర్ సఫూరా, ఢిల్లీ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి గుల్ఫిషా, దేవాంగణ కలిత, నటాషా నర్వాల్ తదితరుల పేర్లను ఈ ఛార్జిషీట్లో చేర్చారు. వారిపై అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్పై ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ (స్పెషల్ సెల్) పీఎస్ కుష్వాహా, ఏసీపీ అలోక్ కుమార్ సంతకాలు చేశారు.
ముస్లిం స్టూడెంట్స్ ఆఫ్ జెఎన్యూ
ఢిల్లీ అల్లర్లు ఓ పద్ధతి ప్రకారం.. పకడ్బందీగా సాగాయని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. అల్లర్లను సృష్టించడానికి ప్రత్యేకంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ ముస్లిం విద్యార్థుల పేరుతో ఓ గ్రూప్ను రూపొందించుకున్నారని అన్నారు. ఢిల్లీ అల్లర్లను ఉగ్రవాద చర్యగా భావిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తమ తుది నివేదికలో స్పష్టం చేశారు. ఈ అల్లర్ల వల్ల 50 మంది మరణించారని, 500 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు పునరుద్ఘాటించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు చెప్పారు.
Recommended Video
ఢిల్లీ ప్రొటెస్ట్ సపోర్ట్ గ్రూప్ పేరుతో..
కొంతమంది అల్లరిమూకలు ఢిల్లీ ప్రొటెస్ట్ సపోర్ట్ గ్రూప్ పేరుతో వాట్సప్ గ్రూప్ను తయారు చేసుకున్నారని, దాని ద్వారా అల్లర్లకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకునే వారని పోలీసులు తమ నివేదికలో పొందుపరిచారు. కేంద్రంలో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం వల్ల కుట్రదారులు తమ అసహనాన్ని ఈ రూపంలో ప్రదర్శించుకున్నారని పేర్కొన్నారు.అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు రావడం వల్ల అంతర్జాతీయ దేశాలన్నీ భారత్ వైపు చూస్తాయని, అల్లర్ల వల్ల ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్టవుతుందని కుట్రదారులు భావించినట్లు తెలిపారు.