ఢిల్లీ అల్లర్లు : పోస్టుమార్టమ్ వీడియో షూట్ చేయాలన్న కోర్టు..
ఢిల్లీ అల్లర్లలో మృతి చెందినవారి పోస్టుమార్టమ్ విషయంలో జాప్యంపై ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో.. ఢిల్లీ కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అల్లర్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన ఓ వ్యక్తి.. విడుదలైన మరుసటిరోజే మృతిచెందడంతో.. మృతుడి పోస్టుమార్టమ్ నిర్వహించేటప్పుడు ఫోటోలు,వీడియో షూట్ చేయాల్సిందిగా ఆదేశించింది. మృతుడి(23) సోదరుడు దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. మృతుడి కుటుంబ తరుపు న్యాయవాది మేనకా కన్నా అభ్యర్థన మేరకు అతనికి సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించలేదు.'
విచారణ జరిపించమన్న కుటుంబం..
పోలీస్ నిర్బంధం కారణంగానే తమ సోదరుడు మృతి చెందాడని పిటిషన్లో పేర్కొన్నారు. అరెస్ట్ తర్వాత అతన్ని చూసేందుకు పలుమార్లు పోలీస్ స్టేషన్కు వెళ్లినా.. తమను లోపలికి అనుమతించలేదని మృతుడి సోదరుడు తెలిపారు. ఫిబ్రవరి 26న అతను చనిపోగా.. పోలీసులు ఇప్పటివరకు చట్టబద్దమైన ప్రొసీడింగ్స్ ఏవీ ఫాలో కాలేదని పిటిషన్లో ఆరోపించారు.ఈ నేపథ్యంలో మరణానికి గల అసలు కారణం తెలియాలంటే సెక్షన్ 177 సీఆర్పీసి కింద విచారణ జరిపించేందుకు ఢిల్లీ పోలీసులను ఆదేశించాలన్న విజ్ఞప్తితో కుటుంబం కోర్టును ఆశ్రయించింది.
మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం..
ఎల్జేఎన్పీ ఆసుపత్రిలో భద్రపరిచిన మృతదేహానికి ఇప్పటివరకు పోస్టుమార్టమ్ నిర్వహించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో మృతుడి చావుకు సంబంధించిన కారణాలు తెలియాలంటే ఆటోస్పై,పోస్టుమార్టమ్ కీలకమని పేర్కొన్నారు. మృతదేహం ఇప్పటికీ ఆసుపత్రి మార్చురీలోనే ఉందని పోలీసులు కోర్టుకు తెలపడంతో.. జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) మార్గదర్శకాల ప్రకారం పోస్టుమార్టమ్ నిర్వహించేటప్పుడు ఫోటోలు,వీడియో షూట్ చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
పోస్టుమార్టమ్ ఆలస్యంపై ఆరోపణలు..
కాగా,ఫిబ్రవరి 24 నుంచి మూడు రోజుల పాటు సాగిన అల్లర్లలో దాదాపు 45 మంది మృతి చెందారు. వీరిలో చాలామంది మృతులకు ఇప్పటికీ పోస్టుమార్టమ్ నిర్వహించలేదు. దీంతో వారి కుటుంబాలు తమవారి మృతదేహాల కోసం ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నాయి. పోలీసులు,అధికారుల జాప్యం వల్లే పోస్టుమార్టమ్ ఆలస్యమవుతోందని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు విచారణ అధికారి మాత్రం నేడు లేదా రేపు పోస్టుమార్టమ్ నిర్వహిస్తామని కోర్టుకు తెలిపారు.