ఢిల్లీ అల్లర్లు : 38కి చేరిన మృతుల సంఖ్య.. రక్తదానం చేసిన 34 మంది జవాన్లు..
దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో జరిగిన అల్లర్లలో మృతుల సంఖ్య 38కి చేరుకుంది. గురువారం సాయంత్రం 8గంటలకు మరో వ్యక్తి జీటీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇప్పటివరకు నమోదైన మృతి కేసుల్లో 34 జీటీబీ ఆసుపత్రిలోనే జరిగాయి. మరో ముగ్గురు లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జగ్ పర్వేష్ చంద్ర ఆసుపత్రిలో మరొకరు మృతి చెందారు.
కాగా,అల్లర్లలో దాదాపు 200 పైచిలుకు మంది గాయపడ్డారు. వీరిలో కొందరు ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం 34 మందికి రక్తం అవసరం కావడంతో.. 50 మంది పారామిలటరీ జవాన్లను ఆసుపత్రికి పంపించారు. వీరిలో 34 మంది రక్తదానం చేయగా.. ఒకవేళ అవసరమైతే మిగతావారి నుంచి కూడా తీసుకుంటామని వైద్యులు చెప్పారు. ఇక ఢిల్లీలోయిన ఎయిమ్స్ ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ బ్యాంకులో 1300 మంది 500 మంది సీఆర్పీఎఫ్,350 మంది బీఎస్ఎఫ్,400సీఐఎస్ఎఫ్,100ఐటీబీపీ జవాన్లు రక్తదానం చేశారు.
ఇదిలా ఉంటే, అల్లర్లపై విచారణ జరిపేందుకు ఢిల్లీ పోలీస్ యంత్రాంగం రెండు సిట్(ప్రత్యేక విచారణ బృందాలు)ను నియమించాయి. అల్లర్లకు సంబంధించిన అన్ని కేసులను ఈ రెండు బృందాలు విచారించనున్నాయి. ఇద్దరు డీసీపీ స్థాయి అధికారుల నేత్రుత్వంలో వీటిని ఏర్పాటు చేశారు. క్రైమ్ బ్రాంచ్ అదనపు కమిషనర్ బీకే సింగ్ సిట్ బృందాలను పర్యవేక్షిస్తారు. ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కార్పోరేటర్ తాహిర్ హుస్సేన్పై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. సెక్షన్ 302 కింద దయాల్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ అంకిత్ శర్మ హత్య కేసులో తాహిర్ హుస్సేన్పై మృతుని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా నిందితులను ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు. ఒకవేళ తమ పార్టీకి చెందినవారైతే డబుల్ పనిష్మెంట్ ఉంటుందన్నారు.