అల్లర్లలో కొత్త కోణం: IB కానిస్టేబుల్ను చంపి డ్రైనేజీలో పడేశారు: తల ఛిద్రమైన స్థితిలో.. !
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న దాడులు, ప్రతిదాడుల్లో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో కానిస్టేబుల్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం ఉదయం ఆయన మృతదేహం ఓ డ్రైనేజీలో లభించింది. తలపై తీవ్ర గాయాలు ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేసి ఉంటారని, బలమైన వస్తువుతో కొట్టడం వల్ల తల ఛిద్రమై ఉంటుందని నిర్ధారించారు. ఆయన శరీరంపై బుల్లెట్ గాయాలు కూడా కనిపించినట్లు తేలింది.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలపై దాడులతో అట్టుడుకుతున్న జఫ్రాబాద్, మౌజ్పూర్ సమీపంలోని చాంద్బాగ్ బ్రిడ్జి వద్ద గల డ్రైనేజీలో కొందరు స్థానికులు అంకిత్ శర్మ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంకిత్ శర్మదిగా ధృవీకరించారు.
అంకిత్ శర్మ అవివాహితుడు. తల్లిదండ్రులతో కలిసి ఖజూరీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అంకిత్ తండ్రి రవీందర్ శర్మ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరోలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. శాంతిభద్రతల విభాగంలో పనిచేసిన రవీందర్ శర్మ 2017లో బదిలీపై ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరారు. అంకిత్ శర్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం పోస్ట్మార్టమ్ కోసం గురు తేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించారు.
Recommended Video
చాంద్బాగ్ బ్రిడ్జి మీదుగా తరచూ అంకిత్ శర్మ రాకపోకలు సాగిస్తుంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి తమ కుమారుడి ఆచూకీ తెలియ రాలేదని అంటున్నారు. తన కార్యాలయం నుంచి ఇంటికి బయలుదేరిన అంకిత్ శర్మ రాత్రయినా చేరుకోలేదని, ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేసినట్లు రవీందర్ శర్మ వెల్లడించారు. రాత్రంతా తాము గాలించినప్పటికీ ఫలితం లేదని, తమ కుమారుడిని ఇలా విగతజీవిగా చూస్తామని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.