కపిల్ మిశ్రా మళ్లీ దూకుడు పెంచాడు.. హిందూ బాధితుల కోసం విరాళాలు.. షాకిచ్చిన బీజేపీ..
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నేపథ్యంలో ఢిల్లీలో తలెత్తిన మతకలహాలకు కుట్రకు సూత్రధారిగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న బీజేపీ నేత కపిల్ మిశ్రా మళ్లీ దూకుడు పెంచాడు. ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటున్న ఈశాన్య ఢిల్లీపై ఆయన కీలక ప్రకటన చేశారు. సొంత పార్టీ నుంచి కూడా గట్టి విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన తన పంథాను మార్చుకోబోనని మరోసారి స్పష్టం చేశారు.
హిందువులకు సాయం చేయండి..
ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్, మౌజ్పూర్, ఘోండా, చాంద్బాగ్, బాబర్పూర్, గోఖుల్పూరి, యమునా విహార్, భజన్పుర తదితర ప్రాంతాల్లో అల్లర్ల కారణంగా చనిపోయిన, నష్టపోయిన హిందూ కుటుంబాలకు అండగా ఉందామంటూ బీజేపీ నేత కపిల్ మిశ్రా శుక్రవారం నుంచి క్యాంపెయిన్ ప్రారంభించారు. ‘‘ముస్లింల దాడుల్లో మరణించిన మనవాళ్ల కుటుంబాలను ఆదుకుందాం.. బతుకుదెరుకు కోల్పోయినవాళ్లకు మళ్లీ ఆకకల్పిద్దాం''అని పిలుపునిచ్చారు.
భారీ స్పందన..
ఢిల్లీ అల్లర్లలో హిందూ బాధితుల కోసం రూ.50 లక్షల విరాళాలు సేకరించాలని మిశ్రా టార్గెట్ గా పెట్టుకున్నారు. తన అకౌంట్లలో సంబంధిత వివరాలు ప్రకటించిన గంటల వ్యవధిలోనే మిశ్రా పిలుపుకు భారీ స్పందన వచ్చింది. ఒక్కరోజులోనే సుమారు రూ.25లక్షల విరాళాలు అందాయి. ఇందులో మోసానికి తావులేదని, లెక్కలన్నీ పక్కాగా రాయిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే..
సంబంధం లేదన్న బీజేపీ
బీజేపీ నేత కపిల్ మిశ్రా మాట్లాడే మాటలకుగానీ, తలపెట్టిన పనులకుగానీ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. మిశ్రా వ్యాఖ్యల వల్లే ఢిల్లీలో హింస తలెత్తిందన్న ఆరోపణలపై బీజేపీ ఇప్పటికే స్టాండ్ వెల్లడించిందని, కపిల్ మిశ్రాగానీ, మరేఇతర నేతలుగానీ అనుచిత కామెంట్లు చేస్తే వాటిని పార్టీకి ముడిపెట్టొద్దని సూచించారు. కాగా, ఢిల్లీ అల్లర్లకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలే కారణమని కేంద్రం మంత్రి ఆరోపించారు.
కేజ్రీవాలే కుట్రదారు..
ఢిల్లీ హింసకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కపిల్ మిశ్రా గురువారం మీడియా ముందుకొచ్చారు. ఢిల్లీ గల్లీల్లో అల్లర్లు సృష్టించింది, హత్యలు చేసింది ఎవరో తన దగ్గర వీడియో ఆధారాలున్నాయని, మొత్తం వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాలే కుట్రదారుడని మిశ్రా ఆరోపించారు. హిందువుల తరఫున నిలబడి పోరాడే విషయంలో తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు.
Recommended Video
ఇంకా నమోదుకాని కేసు..
ఈశాన్య ఢిల్లీలో హింసకు కపిల్ మిశ్రా కూడా కారకుడేనన్న ఢిల్లీ హైకోర్టు.. ఆయనతోపాటు బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ, మరో ఎమ్మెల్యేపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బుధవారం పోలీసుల్ని ఆదేశించింది. అయితే అల్లర్లకు సంబంధించి కేసుల నమోదు సంఖ్య పెరిగినప్పటికీ, బీజేపీ నేతలపై మాత్రం ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు.