ఢిల్లీ అల్లర్లు: హెడ్ కానిస్టేబుల్ హత్య కేసు ఛార్జీషీటులో యోగేంద్ర యాదవ్ పేరు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో రతన్ లాల్ అనే హెడ్ కానిస్టేబుల్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో పోలీసులు తాజాగా దాఖలు చేసిన ఛార్జీ షీటులో స్వరాజ్ ఇండియా చీఫ్, సామాజిక ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్ పేరును ప్రస్తావించారు.
ఛార్జీషీటులో యోగేంద్ర యాదవ్ పేరు చేర్చినప్పటికీ.. అతన్ని మాత్రం నిందితుడిగా పేర్కొనలేదు. అతని పేరు నిందితుల జాబితాలో లేదు. అయితే, అల్లర్లు జరిగిన స్థలాన్ని సందర్శించిన యోగేంద్ర.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఛార్జీషీటులో పేర్కొన్నారు.
ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలోని గోకల్పూరిలో బుల్లెట్ గాయాలతో హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ మృతి చెందారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థించే, వ్యతిరేకించే వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. మూడు రోజులపాటు జరిగిన ఈ అల్లర్లలో సుమారు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.