జరిగిందొకటి... పోలీసుల ఎఫ్ఐఆర్లో మరొకటి..? ఢిల్లీ అల్లర్ల బాధితుడి ఆవేదన...
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకున్న అల్లర్లలో ఓల్డ్ ముస్తాఫాబాద్లో పనిచేసే 22 ఏళ్ల ఓ యువకుడు తన కుడి చేతిని,ఎడమ చేతిలో ఒక వేలును పోగొట్టుకున్నాడు. అల్లర్ల సందర్భంగా చోటు చేసుకున్న పేలుళ్లలో తీవ్రంగా గాయపడటంతో అతని కుడిచేతిని తొలగించాల్సి వచ్చింది. అయితే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో మాత్రం అతను యాక్సిడెంట్ కారణంగా గాయాలపాలైనట్లు పేర్కొనడం గమనార్హం.
ఫిబ్రవరి 25న గురుతేజ్ బహదూర్ ఆస్పత్రిలో అక్కడి వైద్యులు సర్జరీ ద్వారా తన కుడిచేతిని తొలగించినట్లు అక్రమ్ ఖాన్ అనే ఆ యువకుడు వెల్లడించాడు. అల్లర్ల సందర్భంగా జరిగిన పేలుడులో తాను గాయపడగా... పోలీసులు మాత్రం వాస్తవాలను కప్పి పుచ్చేలా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆరోపించాడు. ఇప్పటికీ పోలీసులు తనకు ఎఫ్ఐఆర్ కాపీ అందజేయలేదన్నాడు.
ఆ ఎఫ్ఐఆర్ కాపీని ప్రముఖ జాతీయ మీడియా బయటపెట్టింది. దాని ప్రకారం జరిగిన ఘటనను ఎఫ్ఐఆర్లో యాక్సిడెంట్గా పేర్కొన్న పోలీసులు సెక్షన్ 279(రాష్ డ్రైవింగ్) సెక్షన్ 337(ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే చర్య)ల కింద కేసు నమోదు చేశారు. అక్రమ్ ఖాన్ దీన్ని ఖండిస్తుండగా.. పోలీసులు మాత్రం ఆరోజు యాక్సిడెంట్ జరిగిందని చెబుతున్నారు.
ఆరోజు భజన్పురా ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగినట్లు శక్తి పార్క్ పోలీస్ స్టేషన్కు ఓ ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. గాయపడ్డవారు చికిత్స పొందుతున్న జీటీబీ ఆస్పత్రికి ఓ పోలీస్ను కూడా పంపించి ఆరా తీశామన్నారు. ఆ సమయంలో ఆస్పత్రిలో బెడ్పై ఉన్న అక్రమ్ ఖాన్ వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో లేడన్నారు. దీంతో మెడికో లీగల్ కేసు ఆధారంగా యాక్సిడెంట్ కేసు నమోదు చేశామన్నారు.
మరోవైపు పోలీసుల వాదనను అక్రమ్ ఖాన్ ఖండిస్తున్నాడు. ఆరోజు కసబ్పురాలోని మసీదు వెళ్తుండగా భజన్పురా బజార్ వద్ద ఓ మూక తనపై దాడి చేసిందన్నాడు.దీంతో ప్రాణాలను రక్షించేందుకు పరిగెడుతుండగా మోహన్ నర్సింగ్ హోమ్ నుంచి ఓ బాంబ్ వచ్చి తన ఎదురుగా పడిందన్నారు. అది పేలడంతో తాను అపస్మారక స్థితిలోకి వెళ్లానని... తిరిగి స్పృహలోకి వచ్చేసరికి మెహర్ ఆస్పత్రిలో ఉన్నానని తెలిపాడు. ఢిల్లీ పోలీసులు కేసు నీరుగార్చేందుకే జరిగింది యాక్సిడెంట్గా చెబుతున్నారని ఖాన్ తరుపు న్యాయవాది మహమూద్ ప్రాచా ఆరోపించారు.
బాధితుడు బతికే ఉన్నప్పటికీ ఢిల్లీ పోలీసులు అతని వాంగ్మూలం నమోదు చేయలేదన్నారు. అల్లర్ల సంఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడమేంటని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ మోసపూరిత ఎఫ్ఐఆర్ అని... పోలీసులు ఇకనైనా కేసును సరిగా డీల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.