బురారీ 11 మంది మృతి కేసులో ట్విస్ట్: ఆత్మహత్య కాదు, మరణాన్ని జయించాలని ఉరి
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని బురారీ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని 11 మంది మృతి కొద్ది నెలల క్రితం కలకలం రేపిన విషయం తెలిసిందే. మోక్షం పొందడం కోసమే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని మిగతా వారిని ప్రేరేపించినట్లుగా కూడా వచ్చాయి.
బురారీ ఆత్మహత్యలు: మరో షాక్.. చివరి నిమిషంలో బతకాలని ఆరాటం
అయితే మోక్షం కోసం చేసిన క్రతువు సమయంలో జరిగిన ప్రమాదం కారణంగానే వారు చనిపోయినట్లుగా సైకలాజికల్ అటాస్పీ నివేదికలో వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సీబీఐని మానసిక శవపరీక్ష నిర్వహించాలని కోరారు. తాజాగా సీబీఐ నివేదిక అందించింది.
ఆత్మహత్య చేసుకోవాలని కాదు, మరణాన్ని జయించాలని ఉరి
మృతుల్లో ఆత్మత్య చేసుకోవాలనే ఆలోచన ఏమాత్రం లేదని, ఇదొక ప్రమాదమేనని ఫోరెన్సిక్ ల్యాబ్ స్పష్టం చేసింది. దీని ప్రకారం తాంత్రిక పూజల్లో భాగంగా వారు మరణాన్ని జయించవచ్చుననే ఆలోచనతో ఉరి బిగించుకున్నారని, అది సాధ్యం కాకపోవడంతో ప్రమాదవశాత్తు మరణించారని అభిప్రాయపడింది.
ఇలా సేకరించారు
సైకలాజికల్ అటాప్సీలో భాగంగా మృతుల మానసిక పరిస్థితులతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, చుట్టుపక్కల నివసించే వ్యక్తుల నుంచి సేకరించే సమాచారంతో ఈ నివేదికను రూపొందించారు. క్రతువులో భాగంగానే ఉరివేసుకున్నారని, మృతుల్లో ఏ ఒక్కరికీ చనిపోవాలన్న ఉద్దేశం లేదని నివేదిక పేర్కొంది.
ప్రాథమికంగా ఇలా
కాగా, బురారీ ప్రాంతానికి చెందిన నారాయణ్ దేవీ(77), ఆమె 10 మంది కుటుంబసభ్యులు ఈ ఏడాది జులై ఒకటో తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. పదిమంది మృతదేహాలు ఇంటి పైకప్పునకు వేలాడుతూ కనిపించగా, నారాయణ్ దేవీ మృతదేహం మరో గదిలో కిందపడింది. మృతుల కళ్లకు గంతలు, చేతులు వెనక్కి కట్టి ఉండటాన్ని చూసి తొలుత పోలీసులు సామూహిక హత్యగా భావించారు. అయితే ఆ తర్వాత ఇంట్లో దొరికిన డైరీల ఆధారంగా వారంతా ఆత్మహత్య చేసుకున్నట్లు తొలుత నిర్ధారణకు వచ్చారు.
క్రతువులో భాగంగా
నారాయణదేవీ తనయుడు లలిత్.. చనిపోయిన తండ్రి తనకు కన్పిస్తున్నాడని, ఆయన ఆదేశాలను పాటించాలని కుటుంబ సభ్యులతో చెప్పినట్లు విచారణలో తేలింది. మోక్షం పొందే ఉద్దేశ్యంలో భాగంగా రాత్రిపూట వారు ఆత్మహత్య క్రతువు చేపట్టినట్లుగా విచారణలో తేలింది.