ఢిల్లీలో రాత్రికి రాత్రే మరో షాహీన్బాగ్ : జాఫ్రాబాద్లో రోడ్డు పైకి వచ్చిన 1000 మంది మహిళలు..
దేశ రాజధాని ఢిల్లీలో మరో షాహీన్బాగ్ పుట్టుకొచ్చింది. జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో రాత్రికి రాత్రే 1000 మంది మహిళలు ఆందోళనకు దిగారు. పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ జాబితా(NRC)లను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. చేతిలో జాతీయ జెండాను పట్టుకుని 'ఆజాదీ' నినాదాలు చేశారు. అలాగే చేతులకు బ్లూ బ్యాండ్ కట్టుకుని 'జై భీమ్' నినాదాలు చేశారు. సీఏఏని కేంద్రం ఉపసంహరించుకునేంతవరకు అక్కడినుంచి కదిలేది లేదని తేల్చి చెబుతున్నారు. ఓవైపు షాహీన్బాగ్ నిరసనలను ఉపసంహరించుకోవాలని చర్చలు జరుపుతున్న సమయంలోనే జాఫ్రాబాద్లో షాహీన్బాగ్ తరహా నిరసన పుట్టుకురావడం గమనార్హం.
రోడ్డును బ్లాక్ చేసిన మహిళలు
జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో గుమిగూడిన మహిళలు సీలంపూర్-మౌజ్పూర్,యమునా విహార్ వైపు వెళ్లే రోడ్డు నం.66ని బ్లాక్ చేశారు. హఠాత్తుగా మహిళలంతా రోడ్డెక్కడంతో.. ఆ మార్గంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆందోళనకారుల్లో ఒకరైన బుష్రా అనే మహిళ మాట్లాడుతూ.. కేంద్రం సీఏఏని వెనక్కి తీసుకునేంతవరకు నిరసన ఆపేది లేదన్నారు. సామాజిక కార్యకర్త ఫహీమ్ బేగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరు పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొందన్నారు. స్థానిక ఇస్లాం మత పెద్ద షమీమ్ అహ్మద్.. ఆందోళనకారులను అక్కడినుంచి పంపించేందుకు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు.
జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ మూసివేత
జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్లో రాత్రికే రాత్రే 500 మంది మహిళలు నిరసనకు దిగడంతో.. జాఫ్రాబాద్ స్టేషన్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ ప్రకటించింది. పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు. జాఫ్రాబాద్కు సమీపంలోని సీలంపూర్,కర్దంపురిలో ఇప్పటికే సీఏఏ వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి. దాదాపు 2 నెలల నుంచి షాహీన్బాగ్లో నిరసనలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరో కొత్త నిరసన శిబిరం పుట్టుకురావడం ప్రభుత్వంలో అలజడి రేపేదిగా మారింది.
షాహీన్బాగ్లో చర్చలు..
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న నిరసనకారులతో చర్చలు జరిపేందుకు సుప్రీం కోర్టు నియమించిన మధ్యవర్తులు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. 'నిరసన తెలపడం ప్రజల ప్రాథమిక హక్కు. అయితే దానికీ హద్దులున్నాయి. అందరూ తిరగాడే రోడ్లపై కూర్చుని వాటిని మూసివేయడం సబబు కాదు'అని షాహీన్బాగ్ నిరసనకారులకు సుప్రీంకోర్టు హితవు పలికింది. అయితే తమ డిమాండ్లు నెరవేరేంత వరకూ అక్కడినుంచి కదిలేది లేదని నిరసనకారులు చెబుతున్నారు. సీఏఏని రద్దు చేసేంతవరకు ఆందోళనలు కొనసాగుతాయని చెబుతున్నారు.
వివాదాస్పదమైన సీఏఏ చట్టం..
కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ జాబితా(NRC)వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. పొరుగు దేశాలైన పాకిస్తాన్,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్ల నుంచి భారత్కు శరణార్థులుగా వలసొచ్చిన హిందు,సిక్కు,పార్శీ,బౌద్ద,జైన మతస్తులకు పౌరసత్వం కల్పించాలని నిర్ణయించింది. అయితే ఇందులో ముస్లింలకు స్థానం కల్పించకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం మత ప్రాతిపదికన రాజకీయం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం.. ఆ మూడు దేశాల్లో ముస్లింలు మెజారిటీలు అని.. అలాంటప్పుడు అక్కడ వారు అణచివేతకు గురయ్యే అవకాశం లేదని.. అలాంటివారు వలసొస్తే పౌరసత్వం కల్పించాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తోంది.