ఏనుగును చోరీ చేసిన ఘనుడు: రెండు నెలల తరువాత ఆచూకీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. రెండు నెలల కిందట ఉన్నట్టుండి మాయమైన లక్ష్మీ అనే ఆడ ఏనుగు ఆచూకీ లభ్యమైంది. ఆ ఏనుగును దాని మావటి చోరీ చేసినట్లు తేలింది. ఢిల్లీ తూర్పు ప్రాంతంలోని చిల్లా సమీపంలో యమునా ఖదర్ అనే ప్రాంతంలో ఏనుగును ఉంచినట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావటిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మావటి, అతని కుమారుడిని అరెస్టు చేశారు.
రెండు నెలల కిందట లక్ష్మీ అనే ఏనుగు మాయమైన విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ షక్కర్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏనుగును గాలించడానికి పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడ్డారు. పలు ప్రాంతాల్లో గాలించారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వారు ఏనుగు కోసం అన్వేషించారు. తీరా ఢిల్లీ తూర్పు ప్రాంతం చిల్లా గ్రామ సమీపంలోని యమునా ఖదర్ వద్ద ఏనుగును బంధించి ఉంచినట్లు సమాచారం అందింది.
దీనితో పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఉమ్మడిగా సంఘటనాస్థలానికి వెళ్లి ఏనుగు సంరక్షించారు. మావటి యూసుఫ్ అలీ, అతని కుమారుడు షకీర్ లను అరెస్టు చేశారు. ఏనుగు లభించిన ప్రదేశం.. ఢిల్లీ తూర్పు ప్రాంత డిప్యూటీ పోలీస్ కమిషనర్ ప్రధాన కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉండటం గమనార్హం. యమునా నది ఒడ్డున దట్టంగా పెరిగిన చెట్లు, పొదల మధ్య ఏనుగును బంధించడం వల్ల దాని ఆనవాళ్లు కూడా బయటికి కనిపించకుండా మావటి జాగ్రత్తలు తీసుకున్నాడని అన్నారు. ఏనుగు అనారోగ్యానికి గురైనట్లు గుర్తించారు. పశు వైద్యశాలకు తరలించి, చికిత్స అందిస్తున్నట్లు ఢిల్లీ తూర్పు ప్రాంత డీసీపీ జస్మీత్ సింగ్ తెలిపారు.