ఢిల్లీలో రెండో ఎయిర్పోర్ట్: హిండాన్ ఎయిర్పోర్టు రేపే ప్రారంభం, టేకాఫ్ తీసుకోనున్న తొలి విమానం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో రెండో విమానాశ్రయం సిద్ధమైంది. అక్టోబర్ 11న తొలి ప్రైవేట్ విమానం హిండాన్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోనుంది. ఇప్పటి వరకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ నిర్వహిస్తుండగా తాజాగా హిండాన్ విమానాశ్రయం కూడా అందుబాటులోకి వచ్చింది. హెరిటేజ్ ఏవియేషన్ సంస్థకు చెందిన 9 సీట్లు ఉన్న విమానం ఉత్తరాఖండ్కు టేకాఫ్ తీసుకుంటుంది.
Hindon Airport director Shobha Bhardwaj: Flight connectivity from Hindon airport (Ghaziabad) to Hubballi Airport (K'taka) to begin from 6th Nov.
— ANI UP (@ANINewsUP) October 10, 2019
1st commercial flight, by a pvt airline Air Heritage, from Hindon civil airport will take off on Oct 11, for Uttarakhand's Pithoragarh pic.twitter.com/KKhlTK3V3J
ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్లోని పితోరఘడ్కు విమానం ప్రారంభించిన తర్వాత త్వరలోనే తమ హెరిటేజ్ ఏవియేషన్ సంస్థ డెహ్రాడూన్, హుబ్లీ, షిమ్లాతో పాటు ఇతర పర్యాటక ప్రాంతాలకు తమ విమానాలను నడుపుతుందని ఆ సంస్థ సీఈఓ రోహిత్ మాథుర్ తెలిపారు. ఇక ఢిల్లీ నుంచి పితోరగఢ్కు విమానం టికెట్ ధర రూ.2500గా నిర్ణయించినట్లు చెప్పారు.
హిండాన్ విమానాశ్రయంలో అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ అజయ్ శంకర్ తెలిపారు. ప్రత్యేక శిక్షణ పొందిన 55 మంది పోలీసులు ఈ విమానాశ్రయంలో తమ విధులను నిర్వహిస్తారని కలెక్టర్ చెప్పారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక హిండాన్ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఇందిరాగాంధీ విమానాశ్రయంలో పెరుగుతున్న రద్దీ కాస్త తగ్గుముఖం పడుతుందని అధికారులు తెలిపారు.ఇది ఇందిరాగాంధీ విమానాశ్రయానికి రెండవదిగా వ్యవహరిస్తుందని ఉత్తర్ ప్రదేశ్లోని ఘజియాబాద్ ఎయిర్ఫోర్స్ స్టేషన్కు సమీపంలో హిండాన్ విమానాశ్రయం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు 40 కిలోమీటర్ల దూరంలో హిండాన్ ఎయిర్పోర్టు ఉంది. ఇది ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందినది. ఇందులోనే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ పౌరవిమానాయాన సంస్థను అభివృద్ధి చేసింది. ఉడాన్ పథకంలో భాగంగా సివిల్ ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఐఏఎఫ్ అనుమతించింది. ఇదిలా ఉంటే మార్చి 8, 2018లో హిండాన్ ఎయిర్పోర్టుకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.