బంపర్ ఆఫర్: ఢిల్లీలో 15 రోజులు స్కూళ్లు బంద్
న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ నగరాన్ని రక్షించుకోవడానికి అక్కడి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటున్నది. సరి-భేసి విధానాన్ని సీరియస్ గా తీసుకుని ఎలాగైనా అమలు చెయ్యాలని అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
ఈ సరి-భేసి విధానాన్ని అమలు చెయ్యడంలో భాగంగా జనవరి 1 నుంచి 15వ తేది వరకు ఢిల్లీ నగరంలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ 15 రోజులు సరి సంఖ్య నెంబర్లు గల కార్లు, భేసి సంఖ్య కలిగిన కార్లను అల్టర్ నేటీవ్ రోజుల్లో రోడ్ల మీదకు అనుమతిస్తారు.
ఈ ప్రయోగం వలన ఈ 15 రోజులు ఢిల్లీ నగరంలో సగం కార్లు ఇంటికే పరిమితం అవుతాయని ఢిల్లీ సర్కారు అంటున్నది. అయితే ప్రజలు సంచరించడానికి ప్రత్నామ్నాయ రవాణా సౌకర్యాలు కల్పించడం ఢిల్లీ ప్రభుత్వానికి సవాలుగా మారింది.
ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడానికి 6,000 బస్సులు అవసరం అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా అంటున్నారు. వివిద స్కూల్ లకు చెందిన రెండు వేల బస్సులను తీసుకుంటున్నారు.
ఇప్పటికే వివిద పాఠశాలల యాజమాన్యంతో చర్చించామని మనీష్ సిసోడియా అంటున్నారు. ఢిల్లీ నగరంలో 26 లక్షల మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారని ఆయన వివరించారు. అయితే ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడానికే ఢిల్లీ సర్కారు స్కూల్ బస్సుల మీద కన్ను వేసిందని విమర్శలు వస్తున్నాయి.