ఢిల్లీ స్కూళ్లకు రెండురోజులు సెలవులు.. ఎందుకంటే...
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న పాఠశాలలకు ప్రభుత్వం రెండురోజులు సెలవులను ఇచ్చింది. ఈ నెల 15వ తేదీ శుక్రవారం వరకు పాఠశాలలు మూసివేస్తామని బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొన్నది. గురు, శుక్రవారాల్లో ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేట్ స్కూళ్లను కూడా విధిగా మూసివేయాలని స్పష్టంచేసింది.
కర్బన ఉద్గారాలు, పంట చేను తగలబెట్టడం, పొగ చూరడంతో ఢిల్లీ నగరం కాలుష్య కాశారని తలపిస్తోంది. కొన్ని చోట్ల ఉదయం 11 గంటలైనా సూర్యుడి ఆచూకీ కనిపించడం లేదు. దీంతో పాఠశాలలకు మరో రెండురోజులు సెలవులు ఇస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొన్నది. ఈ మేరకు మంత్రి మనీశ్ సిసోడియా ట్వీట్ చేశారు. ఢిల్లీలో పరిస్థితి దృష్ట్యా రెండురోజులు సెలవులు ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలో వాతావరణం బాగోలేకపోవడంతో స్కూళ్లకు సెలువుల మంజూరు చేయాలని పేరెంట్స్ కూడా కోరుతున్నారు. సోషల్ మీడియా వేదికగా డిమాండ్ పెరగడంతో ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. జహంగిర్పూరి, రోహిణి ప్రాంతాలు కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంది. ముండ్క, బావానాలో కూడా కాలుష్యం పీక్ స్టేజీకి చేరింది.
ఢిల్లీ కాలుష్యకోరల్లో చిక్కినందున పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇదివరకు ప్రభుత్వానికి స్పష్టంచేసింది. దీంతో కేజ్రీవాల్ సర్కార్ నవంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు స్కూళ్లను మూసివేసింది. పరిస్థితి అంతకంతకు మించడం, పేరెంట్స్ నుంచి వినతులు రావడంతో మరోసారి రెండురోజులు సెలవులు ఇస్తున్నట్టు ఆప్ సర్కార్ పేర్కొన్నది.