కరోనా బారిన మైనర్లు... 34.7శాతం మంది.... సెరాలజికల్ సర్వే షాకింగ్ రిపోర్ట్...
తాజా ఢిల్లీ సెరాలజికల్ సర్వే ఫలితాలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. 5-17ఏళ్ల వయసు వారిలోనే ఎక్కువగా యాంటీబాడీస్ని గుర్తించినట్లు సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 5-17 ఏళ్ల వయసున్న 34.7శాతం మందిలో యాంటీబాడీస్ను గుర్తించినట్లు పేర్కొంది. అలాగే 50 ఏళ్ల వయసున్న 31.2శాతం మందిలో,18-49 ఏళ్ల వయసున్న 28.5శాతం మందిలో యాంటీబాడీస్ని గుర్తించినట్లు తెలిపింది.
Recommended Video
15వేల శాంపిల్స్...
మొత్తంగా ఢిల్లీలో 29.1శాతం మంది కరోనా వైరస్ బారినపడినట్లు వెల్లడించిన సర్వే... ఇందుకోసం మొత్తం 15వేల మంది శాంపిల్స్ను పరీక్షించగా... ఇందులో 25శాతం మంది 5-17ఏళ్ల లోపు మైనర్సే అని వెల్లడించింది. మరో 25శాతం మంది 50 ఏళ్లు పైబడ్డవారు కాగా మిగతా 50శాతం మంది 18-49 ఏళ్ల వయసున్నవారు. తాజా సర్వేలో మైనర్స్లోనే ఎక్కువ యాంటీబాడీస్ను గుర్తించడంతో... వారికి వైరస్ సోకడం వెనుక కారణాలేంటన్న దానిపై అధికారులు దృష్టి సారించారు.
మైనర్లకు కరోనా... కారణాలేంటి...
స్కూళ్లు,విద్యా సంస్థలన్నీ ఇప్పటికీ మూసివేసే ఉన్నా... 5-17ఏళ్ల వారు ఎక్కువగా కరోనా బారినపడటం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ఇందులో మురికివాడలు,పేదలు ఎక్కువగా ఉండే కాలనీల్లోని మైనర్స్ ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత లోతైన విశ్లేషణకు మౌలానా అజాద్ మెడికల్ కాలేజీ నుంచి జిల్లాల వారీ డేటా కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. అయితే ఇప్పటివరకూ సర్వే ప్రాథమిక ఫలితాలు మాత్రమే వచ్చాయని... మరింత కచ్చితమైన నిర్దారణ కోసం ఇకనుంచి ప్రతీ నెలా సీరో సర్వేలు చేయాలని నిర్ణయించినట్లు ఢిల్లీ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ నూతన్ ముండేజా తెలిపారు.
పూర్తి రిపోర్ట్ కోసం వెయిటింగ్...
మౌలానా అజాద్ మెడికల్ కాలేజీకి చెందిన ఓ సీనియర్ వైద్యుడు మాట్లాడుతూ... సెరాలజికల్ సర్వే అధికారులు ఇంకా పూర్తి రిపోర్టును సిద్దం చేయలేదన్నారు. మైనర్లలో ఏ జిల్లాలో ఎక్కువ కరోనా తీవ్రత ఇంకా తెలియాల్సి ఉందన్నారు. కాగా,ఢిల్లీలో అగస్టు మొదటివారంలో 15000 శాంపిల్స్తో రెండో సెరాలజికల్ సర్వే నిర్వహించారు. ఇందులో 29.1శాతం మంది కరోనా బారినపడినట్లు రిపోర్టులో వెల్లడించారు. 20,30,40 ఏళ్ల వయసు వారిలో ఎక్కువగా లక్షణాలు లేని కరోనా పేషెంట్స్ ఉన్నారని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన వారంలోనే ఢిల్లీ మైనర్స్లో కరోనా లక్షణాలు బయటపడటం గమనార్హం.
ఎందుకీ సెరాలజికల్ సర్వే...
కాగా,ఏదైనా అంటువ్యాధి మహమ్మారిగా మారి తీవ్రంగా ప్రబలినప్పుడు సెరో సర్వైలెన్స్ ద్వారా దాని తీవ్రతను అంచనా వేస్తారు. జనాభాలో ఉండే రోగ నిరోధక శక్తిని అంచనా వేయడం ద్వారా పరిస్థితి తీవ్రతపై ఒక అంచనాకు వస్తారు. భారత్లో ఇప్పటికే ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై లాంటి నగరాల్లో ఈ సర్వేలను నిర్వహిస్తున్నారు.కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేసులను త్వరగా గుర్తించడం, పరీక్షలు చేయడం,రోగులకు త్వరగా చికిత్స అందించడం కోసం ఇలాంటి శాస్త్రీయ పర్యవేక్షణ విధానాలు ఉపయోగపడతాయని ఐసీఎంఆర్ పేర్కొంది