షాక్: సెల్ ఫోన్ తిరిగి ఇవ్వలేదని.. నడిరోడ్డుపై అటకాయించి.. తుపాకితో..
ఢిల్లీలో దారుణం జరిగింది. లాక్కున్న సెల్ ఫోన్ తిరిగి ఇవ్వలేదనే కోపంతో ఇద్దరు యువకులు మరో యువకుడిని నడిరోడ్డుపై తుపాకితో కాల్చి చంపారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో నడిరోడ్డుపై దారుణం జరిగింది. దినేష్(23) అనే యువకుడిని కాల్చి చంపారు. స్నేహితుడితో కలిసి స్కూటర్ పై ఇంటికెళుతుండగా ఈ అఘాయిత్యం చోటు చేసుకుంది.
బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు దినేష్ ను అటకాయించారు. వారిలో ఒక వ్యక్తి గన్ తో కాల్పులు జరిపాడు. దినేష్ కింద పడిపోయిన తరువాత కూడా కాల్పులు జరిపి పారిపోయారు.
ఈ హఠాత్పరిణామానికి బెదిరిపోయిన దినేష్ స్నేహితుడు స్కూటర్ వేగాన్ని పెంచి అక్కడ్నించి పారిపోయాడు. ఈ హత్యోదంతానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రాణాపాయ స్థతిలో కొట్టుకుంటున్న దినేష్ ను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.
ఈ హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కొద్దిరోజుల క్రితం వారితో దినేష్ గొడవకు దిగినట్లు, వారి సెల్ ఫోన్ లాక్కున్నట్లు తెలుస్తోంది.
దాన్ని తిరిగి ఇవ్వకపోవడంతో కోపం పెంచుకున్న దుండగులు అదను చూసుకుని ఈ దారుణానికి తెగబడినట్లు సమాచారం. సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.