ఢిల్లీ అల్లర్లు : కానిస్టేబుల్కు రివాల్వర్ గురిపెట్టిన షారుఖ్ అరెస్ట్..
దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 24,25,26 తేదీల్లో చోటు చేసుకున్న అల్లర్లలో మహమ్మద్ షారూఖ్ అనే ఓ యువకుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. జాఫ్రాబాద్-మౌజ్పూర్ ప్రాంతంలో ఓ పోలీస్ కానిస్టేబుల్కు రివాల్వర్ గురిపెట్టిన షారూఖ్ ఫోటో సంచలనం రేకెత్తించింది. ఆ ఫోటో బయటకు వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని.. ఎట్టకేలకు వారం తర్వాత ఉత్తరప్రదేశ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు షారూఖ్ను అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని.. అతను పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని షమ్లీలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఢిల్లీ అల్లర్లలో అల్లరి మూకలు పరస్పరం రాళ్లు రువ్వుకుంటున్న సమయంలో షారుఖ్ తన గన్తో 8 రౌండ్లు కాల్పులు జరిపాడు.
కాగా,ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య 46కి చేరింది. మృతుల్లో పోలీస్ కానిస్టేబుల్ రతన్ లాల్, ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ అంకిత్ శర్మ ఉన్నారు. రెండు మృతదేహాలు గోకుల్పురిలోని డ్రైనేజీలో లభ్యమవగా.. మరో మృతదేహం శివ్ విహార్లోని డ్రైనేజీలో లభ్యమైంది. అల్లర్లలో దాదాపు 200 పైచిలుకు మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం రెండు సిట్ బృందాలు దీనిపై విచారణ జరుపుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 254 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా.. ఇందులో 41 కేసులు ఆయుధ చట్టం కింద నమోదు చేయబడినవి. ఇక అల్లర్లతో సంబంధం ఉన్నట్టుగా అనుమానిస్తున్న 903 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం సాయంత్రం కూడా ఢిల్లీలోనిమదన్పూర్ ఖాదర్,తిలక్ నగర్ ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగినట్టు వదంతులు వ్యాపించాయి. దీంతో ఢిల్లీ పరిధిలోని ఏడు మెట్రో స్టేషన్లకు తాత్కాలికంగా సర్వీసులను నిలిపివేశారు. అయితే ఎక్కడా ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోలేదని ఢిల్లీ పోలీసులు,ఆప్ నేతలు స్పష్టం చేశారు.