కరోనా విజృంభణ: దేశ రాజధానిలో ఉమ్మినా రూ. 2వేల జరిమానా, వాటిపై కూడా
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కారు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే మాస్కు ధరించకుండా బయటకు వచ్చిన వారికి రూ. 2 వేలు చొప్పున జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా, అరవింద్ కేజ్రీవాల్ సర్కారు మరిన్ని కఠిన చర్యలను ప్రకటించింది. కరోనా నిబంధనలను ఉల్లంఘించేలా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, పొగాకు వినియోగించినా, భౌతిక దూరం పాటించకపోయినా రూ. 2 వేల చొప్పున జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ సర్కారు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రజల్లో కరోనా భయం పెంచడానికి వీలుగా గతంలో రూ. 500లుగా ఉన్న జరిమానాను రూ. 2 వేలకు పెంచినట్లు కేజ్రీవాల్ సర్కారు తెలిపింది. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఆమోదం అనంతరం వైద్య ఆరోగ్య శాఖ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
కాగా, ఢిల్లీలో గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం 6608 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 118 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5.17 లక్షలకు చేరింది. ఇప్పటి వరకు ఢిల్లీలో 8వేల మంది కరోనా బారినపడి మరణించారు. ప్రస్తుతం దేశ రాజధానిలో 40,936 యాక్టివ్ కేసులున్నాయి.
Recommended Video
మరోవైపు భారతదేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇప్పటి వరకు దేశంలో 90,21,020 కరోపా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 84,43,553 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,32,310 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,43,124 యాక్టివ్ కేసులున్నాయి.