ఢిల్లీ ఆకలి మరణాల కేసు: తెలియని ఔషధం ఇవ్వడంవల్లే చిన్నారులు మృతిచెందారు
ఢిల్లీ: ఢిల్లీలో ఆకలికి తట్టుకోలేక ముగ్గురు చిన్నారులు మృతి చెందిన కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. చిన్నారుల మృతిపై ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ప్రాథమిక దర్యాప్తు ప్రకారం అధికారులు నివేదిక బయటపెట్టారు. పిల్లలు చనిపోకముందు రాత్రి అంటే జూలై 23న ఏదో తెలియని ఔషధం తండ్రి వారికి ఇచ్చినట్లు దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ ఆధారం చేసుకుని కేసును మరింత లోతుగా విచారణ చేసి నిజాలు వెలికి తీయాలని ఢిల్లీ డీసీపీని ఆదేశించింది ప్రభుత్వం.
చిన్నారులకు తెలియని ఔషధం ఇచ్చిన తండ్రి మంగల్ సింగ్ ఇక అప్పటి నుంచి అదృశ్యమయ్యాడు. పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారం దొరకనప్పటికీ వేలకు ఏదో ఒకటి తినేవారని అధికారులు చెప్పారు. అంతేకాదు చనిపోకముందు ముగ్గురు చిన్నారులు విరేచనాలు, వాంతులు చేసుకున్నారని దీన్ని బట్టిచూస్తే కడుపులో ఇన్ఫెక్షన్ అయి ఉంటుందనే అనుమానం అధికారులు వ్యక్తం చేశారు.
అధికారుల వాదన ఇలా ఉంటే... పోస్టు మార్టం నిర్వహించిన లాల్ బహదూర్ శాస్త్రి హాస్పిటల్ వైద్యులు మాత్రం పిల్లలు ఆకలితోనే మృతిచెందారని చెబుతున్నారు. వారి మృతికి మరేది కారణం కాదని కరాకండిగా చెబుతున్నారు. తండ్రి మంగల్ సింగ్ పిల్లలు మృతి చెందినప్పటి నుంచి కనిపించకుండా పోయాడని అతనిపైనే అనుమానం ఉన్నట్లుగా ప్రాథమిక దర్యాప్తు ద్వారా తయారు చేసిన రిపోర్టును ప్రభుత్వానికి అధికారులు సమర్పించారు. విరేచనాలు వాంతులతో బాధపడుతున్న చిన్నారులకు సరైన స్థాయిలో ఓఆర్ఎస్ ఇవ్వలేదని రిపోర్టులో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే పోలీసులు మాత్రం వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ పైనే ఆధారపడ్డారు. పిల్లలు కొన్ని రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో వారి కడుపులో ఎక్కడా ఆహారం ఉన్న ఆనవాలు కనపడలేదని వైద్యులు చెప్పారు. కొన్ని రోజులుగా ఆహారం తీసుకోకుండా... ఒక్కసారిగా ఆహారం తీసుకోవాలన్నా అందుకు శరీరం సహకరించదని వైద్యులు వివరణ ఇచ్చారు. ఒకవేళ ఏదైనా విషం ఇచ్చినా... లేదా ఏదైనా మెడిసిన్ ఇచ్చినా అవి పనిచేసే అవకాశాలు చాలా తక్కువన్న డాక్టర్లు... అవి పనిచేయాలంటే శరీరంలో ఎంతోకొంత కొవ్వు ఉండాలన్నారు. కొవ్వు నిల్వ చేసే శరీరభాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పారు. ఏదైనా రియాక్షన్ వచ్చిఉంటే ఆ ప్రభావం కడుపులోని భాగాలపై పడేదని అలాంటి గుర్తులు తమకు కనిపించలేదని డాక్టర్లు స్పష్టం చేశారు.