రోడ్డు సైడు బేరం .. తీసింది ప్రాణం ... హెడ్ఫోన్ కొనబోతే ...?
న్యూఢిల్లీ : మనం కొనుగోలు చేసే వస్తువును ఒకటికి రెండుసార్లు చూసుకుంటాం. సరిగా ఉంటే బేరమాడుతాం. అలా బార్గేన్ చేసి చివరకు మనకు నచ్చిన వస్తువును తీసుకెళ్తాం. ఇదీ సహజంగా జరిగే పద్ధతి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఓ టీచర్ అలానే చేశాడు. తాను మనసుపడ్డ వస్తువుపై బేరం ఆడాడు. అలా బేరం ఆడుతుండగా మాట మాట పెరిగింది. ఇంకేముంది వినియోగదారుడిని ఒక్కొడిని చేసి .. ఇద్దరు దాడి చేశాడు.
పొట్టకూటి కోసం ..
యూపీలోని షామ్లీకి చెందిన మహ్మద్ ఒవైసీ బతుకుదెరువు కోసం ఢిల్లీ వచ్చారు. గ్రేటర్ నోయిడాలో ఉంటూ అక్కడే గల ఓ మదరసాలలో పిల్లలకు పాఠాలు చెప్తున్నాడు. అతనికి తల్లిదండ్రులు.. నలుగురు అన్నదమ్ములు, ఒక సోదరి ఉన్నారు. అయితే అతను సోమవారం రాత్రి 10 గంటలకు కోత్వాలీ పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డున అమ్మే వారి నుంచి హెడ్ఫోన్ కొనుగోలు చేసేందుకు బేరం ఆడాడు. అదే అతని జీవితాన్ని చిద్రం చేసింది. హెడ్ఫోన్ బేరం విషయంలో హెడ్ఫోన్ అమ్మే లాలన్, ఆయుబ్తో గొడవ జరిగింది. అదీ క్రమంగా వాగ్వివాదానికి దారితీసింది. మాట మాట పెరిగి దాడి చేసే వరకు వెళ్లింది.
కారణమిదే ..
హెడ్ఫోన్ దర విషయంలో మహ్మద్.. లాలన్ అండ్ కో మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇంకేముంది లాలన్ అండ్ టీం మహ్మద్పై భౌతికదాడికి దిగింది. ఆ తర్వాత పాత ఢిల్లీ రైల్వేస్టేషన్ ఎగ్జిట్ గేట్ వద్ద పడేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మహ్మద్ను అరుణ్ అసఫ్ అలీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు ధ్రవీకరించారు. మహ్మద్ను లాలన్ అండ్ టీం దాడి చేసి హతమార్చారని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ఉత్తర ఢిల్లీ ఏసీపీ హరేంద్ర సింగ్ పేర్కొన్నారు.
ఒక్కడని చేసి ..
మహ్మద్, లాలన్ మధ్య హెడ్ఫోన్ ధర విషయంలో గొడవ జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారని ఏసీపీ పేర్కొన్నారు. ఇరువురి మధ్య గొడవ జరిగిందని .. ఘర్షణ జరుగుతుండగానే మహ్మద్ పడిపోయారని చెప్పారని తెలిపారు. ఆ వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో రైల్వేస్టేషన్ సమీపంలో పడేశారని పేర్కొన్నారు. మహ్మద్పై దాడి చేసి హతమార్చిన లాలన్, ఆయుబ్పై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
మరో కోణం ..
అయితే మహ్మద్ శరీరంలో లోపల గాయాలు ఏమీ లేవని మరో పోలీసు అధికారి పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత నిజనిజాలు తేలుస్తాయని .. తర్వాత మృతదేహాన్ని బంధవులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. అయితే మహ్మద్ కుటుంబసభ్యులు మాత్రం .. అతనిని ఇద్దరి కంటే ఎక్కువమంది కలిసి దాడి చేశారని ఆరోపిస్తున్నారు. దాడికి సంబంధించిన ఫుటేజీని కూడా తాము పరిశీలించామని పేర్కొన్నారు. గాయపడ్డ మహ్మద్ ఇంటికొచ్చేందుకు రైల్వేస్టేషన్ బయల్దేరారని బంధువులు చెప్తున్నారు. రైల్వేస్టేషన్ వద్ద పడిపోయాడని .. అతని ఆధార్ కార్డు ఆధారంగా గుర్తించామని తెలిపారు. అతనితో కొన్ని మందులు కూడా ఉన్నాయని తెలిపారు.